Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు గైర్హజరు అవుతున్న నేపథ్యంలో ఆయనను ఈడీ అరెస్టు చేస్తుందంటూ ఊహాగానాలు వస్తున్నాయి. వరుసగా మూడు సార్లు ఈడీ నోటీసులు పంపినా కేజ్రీవాల్ విచారణకు డుమ్మా కొట్టారు. ఇప్పటికీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నేతలు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ వంటి నేతలు జైలులో ఉన్నారు.
డిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తొంది. ఈ క్రమంలో కేసులో విచారణకు హజరుకావాలని ఈడీ ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చింది. కానీ కేజ్రీవాల్ మాత్రం ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా ఈడీ ముందు విచారణకు హజరుకాలేదు. కేజ్రీవాల్ కు తొలుత గత ఏడాది నవంబర్ 2న విచారణకు హజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్ విచారణకు హజరుకాలేదు. ఆ తర్వాత డిసెంబర్ 21, జనవరి 3న విచారణకు హజరుకావాలని ఈడీ నోటీసులు పంపింది. కానీ వాటిని కూడా కేజ్రీవాల్ దాట వేశారు.
ఈ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం ఈడీ అరెస్టు చేస్తుంది అంటూ ఆప్ నేతలు, మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు. గురువారం ఉదయం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై ఈడీ దాడులు చేస్తుందని, ఆ తర్వాత అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని బుధవారం అర్ధరాత్రి చేసిన ట్వీట్ లో వారు పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో గురువారం ఉదయం ఈడీ దాడి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ బుధవారం రాత్రి 11.50 గంటలకు ఆప్ మంత్రి అతిషి ట్వీట్ చేశారు. ఆ తర్వాత మరో మంత్రి సౌరఖ్ భరద్వాజ్ ఇదే విషయాన్ని హిందీలో పోస్టు చేశారు.
కేజ్రీవాల్ ఇంటికి వెళ్లే రహదారులను పోలీసులు ఇప్పటికే బ్లాక్ చేశారని, అరెస్టునకు ముందు కేజ్రీవాల్ ఇంటిపై సోదాలు జరిపే అవకాశం ఉందని ఆప్ నేతలు పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ కోసం ఇప్పటికే మూడు సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ నుండి ఎలాంటి స్పందన లేదని ఈడీ వర్గాలు తెలిపాయి. విచారణకు సహకరించకపోవడంతో నిబంధనల ప్రకారం ఆయనపై ఎప్పుడైనా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయవచ్చు. ఆయన్ని అరెస్టు చేయవచ్చు.
అయితే ఈడీ సమన్లు ప్రేరేపితమైనవని కేజ్రీవాల్ అన్నారు. ఈ కేసులో తనను సాక్షిగా పిలుస్తున్నారా.. లేదా అనుమానితుడిగా పిలుస్తున్నారా అనేది స్పష్టంగా తెలియదని చెప్పారు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయకుండా తనను ఆపాలనే ఈడీ యోచిస్తున్నట్లు ఆరోపించారు.