ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జేడీయూ పార్టీలో చేరిక గురించి ఆ పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన విషయం బైటపెట్టారు. ప్రశాంత్ కిషోర్ను జేడీయూలోకి తీసుకోవాలంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచనల మేరకే ఆయనను తమ పార్టీలోకి తీసుకున్నట్లు నితీష్ కుమార్ తేల్చేశారు. అంతేకాదు పికెను తమ పార్టీలో చేర్చుకోవాలంటూ అమిత్ షా ఒక్కసారి కాదని, ఆయన అదే విషయాన్ని రెండుసార్లు తనకు సూచించారని నితీష్ కుండబద్దలు కొట్టారు.
మీ రాజకీయ వారసుడిగా ప్రశాంత్ కిషోర్ను ప్రమోట్ చేస్తున్నారా అంటూ ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నితీష్ కుమార్ ఈ జవాబు చెప్పారు. దీంతో నితీష్ వెల్లడించిన ఈ విషయం జాతీయ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రాంతీయ పార్టీలను మేనేజ్ చేసే విషయంపై కూడా బిజెపి గతంలో కంటే మరింత లోతుగా దృష్టి సారించినట్లు ఈ విషయం తేటతెల్లం చేస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే అంతమాత్రాన తాను ప్రశాంత్ కిషోర్ సామర్థ్యాన్ని తాను తక్కువగా చూడటం లేదని, అందుకే ఆయనకు రాష్ట్రంలో యువతను సమన్వయపరిచే బాధ్యతలు అప్పగించినట్లు నితీష్ తెలిపారు. రాష్ట్రంలో సామాజిక వర్గాల ప్రధాన్యతలతో సంబంధం లేకుండా యువత రాజకీయాలపై అవగాహన,ఆసక్తి పెరిగేలా చూడాలని తాను ప్రశాంత్ కిషోర్ కు సూచించినట్లు నితీష్ వెల్లడించారు.
అయితే ప్రశాంత్ కిషోరే మీ రాజకీయ వారసుడా?…అని మీడియా నుంచి పదే పదే తనకు ఎదురవుతున్న ప్రశ్న విషయమై నితీష్ కొంత ఘాటుగానే స్పందించారు. అసలు తన రాజకీయ వారసుడు ఎవరనే విషయం ఇప్పుడు అనవసరమని, అయినా ఇలా రాజకీయ వారసత్వాన్ని అందించేందుకు మనం రాజరిక పాలనలో లేమని, మనది ప్రజాస్వామ్య దేశమనే విషయాన్నిగుర్తించాలని స్పష్టంచేశారు.
ఎన్నికల్లో ఒక పార్టీ నాయకుడు విజయం సాధించాడంటే ఆ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం వల్ల ప్రజల ఆదరాభిమానాలతో గెలిచారని భావించాలే తప్ప వారి కుటుంబ నేపథ్యం చూసి ఓటేసి గెలిపించడం జరగదని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
ఇక బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తో తన శత్రుత్వం గురించి చెబుతూ తమ మధ్య కేవలం రాజకీయ విబేధాలే తప్ప వ్యక్తిగత శతృత్వం వంటివేమీ లేవని చెప్పారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తనను పరుష పదజాలంతో విమర్శించినప్పటికీ ఆయన పట్ల విముఖత ఏమీ లేదని, ఆయనపై మునపటి గౌరవమే ఉందని నితీష్ వివరించారు.