ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరు హాట్ టాపిక్ అనే చెప్పాలి. ప్రతిపక్షాలు ఈ పేరుమీదే చాలా రోజులుగా రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నాయి. ప్రభుత్వానికి కూడా ఈ పేరే గత చాలా రోజులుగా అతిపెద్ద సమస్యగా ఉంది! ఈ వ్యవహారం చినికి చినికి.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్న స్థాయిలో గాలివానగా మారింది! ఈ విషయంలో జగన్ ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని భావించడమే దీనికి కారణం! అయితే… తాజాగా ఈ కథ క్లైమాక్స్ కి వచ్చేసినట్లే!!
అవును… హైకోర్టు తీర్పు అనంతరం నిమ్మగడ్డ ఉత్సాహం చూశారో లేక ఈ విషయాన్ని ప్రిస్టేజ్ గా తీసుకున్నారో తెలియదు కానీ… నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉండటానికి జగన్ సర్కార్ నిరాకరిస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే… ఈ కేసు ప్రాముఖ్యత దృష్ట్యా అతి తొందరగానే విచారణకు సుప్రీం డేట్ ఫిక్స్ చేసింది. ఇందులో భాగంగా… ఈ కేసు సుప్రీం కోర్టులో ఈ నెల 10న విచారణకు వస్తోంది.
దీంతో… నిమ్మగడ్డ కేసు సుప్రీంకు వెళ్లడంతో ఏపీ రాజకీయాలనే ప్రభావితం చేసిన ఈ కేసులో తీర్పు ఎలా వస్తుంది అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది! ఈ కేసు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే జగన్ సర్కార్ కు కాస్త ఊరటే అనుకోవచ్చు కానీ… వ్యతిరేకంగా వస్తే మాత్రం ప్రతిపక్షాలకు ఫుల్ మీల్స్ దొరికినట్లేననడంలో సందేహం లేదు! దీంతో…ఇంతటి విశేషం ఉన్న ఈ కేసు కావడంతో తుది తీర్పు ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది! కాగా, ఈ కేసును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఆద్వర్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ విచారిస్తోంది.