ప్రముఖ సినీ నటుడు ఆలీ ఇటీవలే ఏపి ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా) గా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. తన చాంబర్ లోకి చేరుకున్న ఆలీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ చేతుల మీదుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలీ మీడియాతో మాట్లాడుతూ..తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడం పట్ల సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై సీఎం జగన్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా తాను ఏమి చేయాలన్న దానిపై ఒక వారంలో ఒక క్లారిటీ వస్తుందన్నారు.
ఉత్తరాంధ్ర లో ఇటీవల తాను షూటింగ్ కు వెళ్లిన సమయంలో అక్కడ బీచ్ లు, రోడ్లు చూశాననీ, వాటిని కొద్దిగా అభివృద్ధి చేస్తే తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషా సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ లు జరుపుకుంటాయని ఆలీ అభిప్రాయపడ్డారు. తద్వారా ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సీఎం వైఎస్ జగన్ మనసున్న మనిషి అనీ, వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే ఘన విజయమని ఆలీ స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై తాను దృష్టి పెడతానని చెప్పారు.
ఆలీ గత ఎన్నికలకు ముందు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆలీకి ప్రభుత్వంలో మంచి పదవి లభిస్తుందని ప్రచారం జరిగింది. తొలుత వక్ఫ్ బోర్డు చైర్మన్ అలీ, తరువాత మైనార్టీ కార్పోరేషన చైర్మన్, ఫిలిమ్ డవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్, అలానే రాజ్యసభ, ఎమ్మెల్సీ ఇలా పలు రకాల పదవులు ఆయనకు వరించనున్నట్లు ప్రచారం జరిగింది. తనకు ఏదో ఒక పదవి ఖాయమంటూ కూడా ఆలీ గతంలో మీడియా ముఖంగానే చెప్పారు. రీసెంట్ గా ఆయన ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితులైయ్యారు. ఆ తర్వాత మరో నటుడు పోసాని కృష్ణమురళికి జగన్ సర్కార్ కీలక పదవిని ఇచ్చింది. ఆయనను ఏపి ఫిలిమ్ డవెలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమించింది.