Amith Shah : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పరిపాలన తీరుపై ఓ పక్క ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, మరో పక్క బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా వామపక్షాలు కూడా పలు ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రారంభంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత మనోహర్ తదితరులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో నామినేషన్ లు దాఖలు చేయడమే ఓ పెద్ద సమస్యగా ఉందని కూడా సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆన్ లైన్ ద్వారా నామినేషన్ ల స్వీకరణ చేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు, తాజా రాజకీయ పరిస్థితులపై ఇటీవల బీజెపీ నేతలు కేంద్రానికి వివరించారు. అదే విధంగా టీడీపీ పార్లమెంట్ సభ్యులు ఓ వినతి పత్రాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసి అందించారు. దీంతో రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్రం ఆరా తీస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు అమిత్ షా రావచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ మేరకు రాష్ట్ర బీజెపీ నేతలకు సంకేతాలు కూడా ఇచ్చారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావడానికి అమిత్ షా సిద్దమైనట్లు సమచారం. మార్చి 4, 5 తేదీలలో అమిత్ షా తిరుపతి పర్యటన ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో నీటి వివాదాల పరిష్కారానికి తిరుపతిలో 4వ ముఖ్యమంత్రులతో అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. ఈ సమావేశంలో నదుల అనుసంధానం అంశంపై ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించనున్నారు. అదే విధంగా మార్చి 5వ తేదీన తిరుపతి ఉప ఎన్నిక అంశంపై పార్టీ నేతలతో చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంపై బీజెపీ – జనసేన మధ్య ఇంత వరకూ ఏకాభిప్రాయం రాలేదు. అదే రోజు బీజెపీ, జనసేన నేతలతో చర్చించి ఫైనల్ చేసే అవకాశం కూడా ఉంది. అదే విధంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ఫిర్యాదులపైనా చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.