AP Breaking News: ఏపిలో తెలుగుదేశం పార్టీ అధికార వైసీపీకి వ్యతిరేకంగా బాదుడే బాదుడు పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. వైసీపీ కూడా గడప గడపకు వైసీపీ పేరిట ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఎమ్మెల్యేలు గ్రామాల్లో గడప గడపకు వైసీపీ కార్యక్రమానికి సిద్ధం అవుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ ముఖ్యనేతలపై కేసుల ఆయుధాన్ని వైసీపీ సర్కార్ బయటకు తీసినట్లు కనబడుతోంది. ఏడాది క్రితమే ముగిసిపోయిందని అనుకుంటున్న అమరావతి రాజధానిలోని వ్యవహారాన్ని బయటకు తీసి తాజాగా చంద్రబాబు, నారాయణ తదితర ముఖ్యనేతలపై కేసులు నమోదు చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసులో చంద్రబాబుకు నోటీసు ఇచ్చి అందులో పాత్ర ఉందని తేలిసే ఆయనను అరెస్టు చేస్తారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి పేర్కొన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
AP Breaking News: ఆ కేసులో చంద్రబాబుకు హైకోర్టు స్టే
అయితే టీడీపీ ముఖ్య నేతలపై కేసుల నమోదుతో వారిలో ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. క్యాడర్ ఆందోళనలో ఉంటుంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు వాయిదా పడవచ్చు. అందుకే వైసీపీ పక్కా రాజకీయ వ్యూహంతో కేసులు నమోదు చేయించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే ఏపి సీఐడీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని ఎస్సీ, ఎస్టీల నుండి గత ప్రభుత్వం రాజధాని కోసం బలవంతంగా భూములు తీసుకుంది అని ఫిర్యాదు చేశారు. వాళ్లకు ఇష్టం లేకుండా వాళ్లను మోసం చేసి భూములు తీసుకున్నారని, వాళ్లకు తక్కువ ధర చెల్లించారని ఆయన ఆనాడు ఆరోపించారు. రైతులు తన వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారనీ, దానిపై యాక్షన్ తీసుకోవాలని ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేయగా అప్పట్లోనే చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్ తదితరులపై కేసు నమోదు చేసింది. చంద్రబాబుకు మార్చి 23న విచారణకు హజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దానిపై టీడీపీ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు దానిపై స్టే ఇచ్చింది. దీంతో అది అక్కడితో ఆగిపోయింది.
చంద్రబాబుతో సహా మరి కొందరిపై ఏపి సీఐడీ తాజా కేసు
ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత అంశంపైనే మరో విధంగా ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ లో అక్రమాలు జరిగాయని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిలో ఏ 1 గా చంద్రబాబు, ఏ 2 గా నారాయణ, ఏ 3 గా లింగమనేని రమేష్ పాటు మరి కొందరిపై కేసు నమోదు అయ్యింది. గత ఏడాది ఏ సెక్షన్ల పై వారిపై కేసు నమోదు చేశారో ఇప్పుడు అవే సెక్షన్ల కింద మరో సారి కేసు నమోదు చేశారు. ఆనాటి కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఈ కేసులోనూ వారే నిందితులుగా ఉన్నారు. అయితే ఈ కేసును నిన్ననే ఏపీ సీఐడీ నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబుతో సహా ఇతర నిందితుల అరెస్టు వరకూ సీఐడీ వెళుతుందా..? లేక ముందుగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుందా..? అనేది వేచి చూడాలి. ఇదే క్రమంలో ఈ కేసుపైనా టీడీపీ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. వీరు హైకోర్టును ఆశ్రయిస్తే విచారణను ఎదుర్కోవాలని ఆదేశిస్తుందా..? లేక గతంలో మాదిరిగా స్టే ఇస్తుందా..? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.