AP Cabinet Sub Committee: రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యలపై నేడు కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష జరిపింది. మంగళగిరి ఏపిఐఐసీ భవనంలోని ఆరవ అంతస్తు కాన్ఫరెన్స్ హాలు నందు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన మంత్రుల సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ అధికారులు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పవన్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కరోనా నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.
రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వాక్సినేషన్ వేగవంతంపై మంత్రుల కమిటీ చర్చించింది. కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్స్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా ఆక్సిజన్ ప్రతి రోజు అన్ని కోవిడ్ ఆసుపత్రులలో అందుబాటులో ఉంచాలన్నారు. నేటి నుండి రాష్ట్రంలో పగటి పూట కర్ఫ్యూ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ పకడ్బందీగా నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది.
సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, బొత్సా సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, డాక్టర్ సిదిరి అప్పలరాజు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.