YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం మరో సారి గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ ప్రక్రియను జూన్ 30 నాటికి పూర్తి చేసి జూలై నాటికి వారికి కొత్త వేతనాలు అందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. వాస్తవానికి వీరి ప్రొబేషన్ డిసెంబర్ నాటికే పూర్తి చేయాల్సి ఉంది కానీ 25 శాతం మంది ఇంకా డిపార్ట్ మెంటల్ పరీక్షలు రాయలేదు. వీరికి కూడా ప్రొబేషన్ పరీక్షలు పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించగా, మార్చి మొదటి వారంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
YS Jagan: యుద్ద ప్రాతిపదికన వారికి కారుణ్య నియామకాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం కలెక్టర్లతో నిర్వహించిన స్పందన వీడియో కాన్పరెన్స్ లో ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయం గురించి ప్రస్తావించారు. పీఆర్సీ అమలు సహా ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశామన్నారు. కోవిడ్ కారణంగా మరణించిన ఫ్రంట్ లైన్ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇవ్వడంపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామనీ, కారుణ్య నియామకాలు చేయమని చెప్పామని అన్నారు. యుద్ద ప్రాతిపదికన వారికి కారుణ్య నియామకాలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను వినియోగించుకోవాలన్నారు. ఇతర విభాగాల్లో ఉద్యోగాలంటే ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి సమస్యలు లేకుండా యుద్ద ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాలని సీఎం జగన్ చెప్పారు.
ఉద్యోగులకు మంచి జరగాలనే ఉద్యోగ విరమణ వయసును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచామని సీఎం చెప్పారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో ఉద్యోగులకు పది శాతం స్థలాలను 20 శాతం రాయితీపై కేటాయించాలనీ, స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను మార్చి 5లోగా రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఉద్యోగుల డిమాండ్ ను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారు.