చంద్రబాబు సభల్లో అమాయకులు బలి అవుతున్నా దత్త పుత్రుడు ప్రశ్నించరనీ, పోలీసులపైనే నెపం వేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. కందుకూరు, గుంటూరులో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ టీడీపీ, జనసేనపై విమర్శలు సంధించారు సీఎం జగన్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో భాగంగా రాజమండ్రిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు సీఎం జగన్. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛను అందజేస్తున్నామన్నాారు. ఫించన్ మొత్తాన్ని తాను పాదయాత్రలో చెప్పినట్లుగానే పెంచుకుంటూ వెళుతున్నానని తెలిపారు. ఆదివారం అయినా, పండుగ రోజు అయినా సరే ప్రతి నెలా ఒకటవ తేదీ ఫించనును పంచి పెడుతున్నామని అన్నారు. పెన్షన్ నెలకు రూ.2,750లకు పెంచి పంపిణీ చేస్తున్నామనీ, వచ్చే ఏడాదికి రూ.3వేలకు పెంచడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో 64 లక్షల మంది కుటుంబాలకు పెన్షన్ అందిస్తున్నామనీ, ఈ స్థాయిలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపియేనని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. అర్హులకు బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. 30లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వ హయంలో పెన్షన్ వెయ్యి మాత్రమే ఇచ్చేవారిని అది కూడా కేవలం 39 లక్షల మందికి మాత్రమేనని చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ దారుల సంఖ్య పెరిగిందన్నారు. పెన్షన్ కోసం నెలకు రూ.1765 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గతంలో మాదిరిగా ఎక్కడా వివక్షతకు తావు లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో నెలకు పెన్షన్ల ఖర్చు కేవలం రూ.400 కోట్లు మాత్రమేనన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న కుళ్లు రాజకీయాలను చూసి బాధేస్తుందని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపటు పొడిచి పార్టీని లాక్కున్నారని విమర్శించారు. ఎన్నికలకు వచ్చినప్పుడల్లా చంద్రబాబు ఎన్టీఆర్ కు దండ వేస్తారని అన్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడవడం, డ్రామాలు చేయడం, మొసలి కన్నీరు కార్చడం ఈ చంద్రబాబు నైజమని విమర్సించారు. గోదావరి పుష్కరాల్లో సందర్భంగా రాజమండ్రిలో చంద్రబాబు 29 మందిని బలి తీసుకున్నారనీ, తాజాగా కందుకూరులో జనం ఎక్కువ మంది వచ్చినట్లుగా చూపించే ప్రయత్నం చేసి 8 మంది మరణానికి కారణమైయ్యారని, గుంటూరులో ముగ్గురు మహిళలను పొట్టన పెట్టుకున్నారని జగన్ దుయ్యబట్టారు.
చంపేసిన వ్యక్తే తానే మహోన్నత మానవతా వాదిగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. పేదలను చంపేసి టీడీపీ కోసం త్యాగలు చేశారంటున్నారనీ, చనిపోయిన వారిలో కులాలను కూడా చూస్తారన్నారు. వారం రోజుల వ్యవధిలో 11 మందిని బలి తీాసుకున్నారన్నారు. ఇంత జరుగుతున్నా దత్తపుత్రుడు మాత్రం ప్రశ్నించరని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విమర్శించారు. వాళ్ల నిర్లక్ష్యాన్ని పోలీసులపైకి నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు అనుకూల మీడియా ఏమి రాయదని జగన్ అన్నారు.
YSRCP Internal: రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు మళ్లీ ఖాయమే ..! కానీ..?