ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగన్ విజయనగరం జిల్లా పర్యటన చేయనున్నారు. ఈ క్రమంలో భాగంగా ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి బయలుదేరి 11.15 గంటలకు గుంకలాం చేరుకుంటారు. అక్కడ పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
విజయనగరం నియోజకవర్గంలోని గుంకలాం వద్ద 12,301 మంది లబ్దిదారుల కోసం 397.36 ఎకరాల్లో భారీ లే అవుట్ వేశారు. ఇక్కడ ప్రభుత్వం రూ.4.37 కోట్లతో లే అవుట్ అభివృద్ధి చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గానూ ప్రభుత్వం రూ.101.73 కోట్లు ఖర్చు చేసి 428 మంది రైతుల నుండి భూమిని కొనుగోలు చేసింది. విజయనగరం జిల్లా మొత్తం 1,08,230 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను అందిస్తోంది. దీనిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 65,026 మంది, పట్టణ ప్రాంతాలకు చెందిన 43,204 మంది లబ్దిదారులు ఉన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు గానూ ప్రభుత్వం మొత్తం ఈ జిల్లాలో 1,164 లే అవుట్ లను సిద్ధం చేసింది. ఈ లే అవుట్ల అభివృద్ధికి రూ.10.19 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.