ఏపి ఆర్ధిక పరిస్థితి బాగాలేదనీ, పరిమితికి మించి అప్పులు చేస్తోందంటూ ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా సంక్షేమ పథకాల అమలునకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి క్రమం తప్పకుండా నిధులను విడుదల చేస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయా వర్గాల లబ్దిదారులకు నేరుగా నిధులను జమ చేస్తున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద ఇప్పటి వరకూ రెండు సార్లు లబ్దిదారులకు నిధులను విడుదల చేశారు. ఇప్పుడు మూడవ విడత వైఎస్ఆర్ కాపు నేస్తం పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపి సీఎం వైఎస్ జగన్ రేపు (శుక్రవారం) కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించి అక్కడ నుండి వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయాన్ని బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.
రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి బయలుదేరనున్న సీఎం జగన్ 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకోనున్నారు. 10.45 గంటల నుండి 12.15 గంటల వరకూ బహిరంగ సభా ప్రాంగణంలో ప్రసంగిస్తారు. అనంతరం కాపు నేస్తం నిధులను లబ్దిదారుల ఖాతాల్లోకి విడుదల చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటలకు అక్కడ నుండి తిరుగు ప్రయాణం అవుతారు. 1.30 గంటలకు తాడేపల్లికి సీఎం చేరుకుంటారు.