AP High Court : ఏస్ఈసీకి ఏపి హైకోర్టులో ఒకే రోజు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. మున్సిపల్ ఎన్నికల్లో రీ నామినేషన్లు, వాలంటీర్ల విషయంలో ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.
వివరాల్లోకి వెళితే.. తిరుపతి, రాయచోటి, పుంగనూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లో రీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఎస్ఈసీ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.
అదే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వాలంటీర్లపై ఎస్ఈసీ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వార్డు వాలంటీర్లపై ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపైనా విచారణ జరిపిన హైకోర్టు ఎస్ఈసీ ఆంక్షలను కొట్టివేసింది. దీంతో ఒకే రోజు ఎస్ఈసీకి హైకోర్టులో రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఎస్ఈసీ పలు మున్సిపాలిటీలో వార్డులకు రీ నామినేషన్లకు అవకాశం కల్పించినా ఎక్కువ వార్డుల్లో నామినేషన్ లు దాఖలు కాలేదు. కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో తాజాగా తీసుకున్న నామినేషన్లపై ఎస్ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఎస్ఈసీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.