Nagarjuna Sagar: ఏపీ – తెలంగాణ మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది. నాగార్జున సాగర్ డ్యామ్ నుండి ఏపీ అధికారులు నిన్న తాగునీటి అవసరాలకు నీరు విడుదల చేయడం రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. డ్యామ్ వద్ద రెండో రోజు కూడా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. డ్యామ్క్ కు ఇరువైపులా ఓ పక్క ఆంధ్ర పోలీసులు, మరో పక్క తెలంగాణ పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. సాగర్ కు ఉన్న మొత్తం 26 గేట్లలై 13వ నంబర్ గేటు వద్ద ఏపీ పోలీసులు కంచెను ఏర్పాటు చేశారు. కృష్ణా రివర్ వాటర్ బోర్డు నిబంధనల ప్రకారం 13వ గేటు వరకూ తమ పరిధిలో ఉంటుందని ఏపీ పోలీసులు చెబుతున్నారు. ఈ కారణంగానే తాము 13వ గేటు వద్ద కంచెను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు.
అయితే ఏపీ పోలీసులు వేసిన కంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించగా, అందుకు ఆంధ్రా పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కుడి కాలువ ద్వారా ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది. ఈ వివాదం నేపథ్యంలో కృష్ణా బోర్డు అధికారులు సాగర్ వద్దకు చేరుకని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిణి స్మితా సభర్వాల, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు సాగర్ కు చేరుకుని సమీక్షించనున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారుల పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉందని అంటున్నారు. గత రెండు రోజులుగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఏపీ వైపు సాగర్ వద్ద బందోబస్తు చర్యలు చేపట్టారు.
మరో పక్క బుధవారం రాత్రి జరిగిన ఘటనపై ఏపీ పోలీసులపై నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. అనుమతి లేకుండా డ్యామ్ పైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు, ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులపై నాగర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ..సాగర్ జలాల విషయంలో తాము సక్రమంగానే విధులను నిర్వర్తిస్తున్నామని చెప్పారు. దీనిపై కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని అన్నారు. కొందరు రెచ్చగొట్టి ఈ ఘటనను వివాదాన్ని చేయాలని చూస్తున్నారన్నారు. సాగర్ పై దండ యాత్ర అంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఏపీ హక్కును కాపాడుకునే ప్రయత్నం చేశామని మంత్రి అంబటి తెలిపారు. మన ప్రాంతంలో మనకు రావాల్సిన నీరును ఏపి విడుదల చేయడం లో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించవద్దని మంత్రి అంబటి కోరారు. తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకే తాము రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని చెప్పారు. గుంటూరు, ప్రకాషం జిల్లాలకు తాగునీరు అందించేందుకు నీటిని విడుదల చేసుకున్నామని అన్నారు. కృష్ణా జలాల్లో ఏపీకీ 66, తెలంగాణకు 34 శాతం వాటా ఉందని గుర్తు చేశారు. తమ వాటా ప్రకారమే తాము వాడుకుంటున్నామని చెప్పారు. తమ భూభాగంలో తమ కెనాల్ ను ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయడం తప్పా అని ప్రశ్నించారు. తాగునీటి అవసరాల కోసం తెలంగాణ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పని లేదని అన్నారు.
Cyclone Michaung: పొంచి ఉన్న తుఫాను ముప్పు ..ఏపీకి భారీ వర్ష సూచన