Araku: ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో తెలుగుదేశం పార్టీ ఉంది. ఎందుకంటే రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య. అందుకే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి పొరపాట్లు జరగకూడదు అని, స్వయంకృతాపరాధాలు ఉండకూడదని టిడిపి చాలా ప్రయత్నాలు చేస్తున్నది. వైసిపి అధికారంలో ఉంది. జోష్ లో ఉంది. సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్న ఉత్సాహం లో ఉంది. అన్ని రకాలుగా వనరులు ఉన్నాయి అందుకే వైసిపి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అభ్యర్థులను మారుస్తారా.. లేదా అనేది వైసీపీలో ఇప్పుడే అంత చర్చకు రాదు. ఎప్పుడైనా రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ మీదే అధిక ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు అధికారంలోకి రావాలన్న ఆకలితో ఉంటాయి. అధికార పార్టీలు అధికారంలోనే నిలవాలన్న కాన్ఫిడెన్స్ తో ఉంటాయి. అందుకే ఇప్పుడు ప్రతిపక్ష టిడిపిలో అభ్యర్థుల మార్పులు ఉంటాయి.
Araku: టిడిపి అభ్యర్థి కంటే స్వతంత్ర అభ్యర్థికే ఎక్కువ ఓట్లు
విశాఖపట్నం జిల్లాలో ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం అరకు గురించి చెప్పు కున్నట్లయితే… 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ చావు దెబ్బ తిన్నది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున కిడారి సర్వేశ్వరరావు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి సివేరు సోమ కు కేవలం 29 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి గాలి ఉన్నప్పటికీ ఇక్కడ టిడిపి అభ్యర్థి 33 వేల తేడాతో ఓడిపోయారు. 2009లో ఇదే అభ్యర్థి సోమ కేవలం 400ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019 వచ్చేసరికి టిడిపి చాలా దారుణంగా ఓడిపోయింది. వైసీపీ తరఫున పోటీ చేసిన శెట్టి పాల్గుణ 53,101 ఓట్లు సాధిస్తే, టిడిపి తరఫున పోటీ చేసిన మంత్రి కిడారి శ్రావణ్ కేవలం 19 వేల ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. అనూహ్యంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సివేరు దొన్ను దొర 27,600 ఓట్లు తెచ్చుకున్నారు. ఇక్కడ టిడిపి అభ్యర్థి కంటే స్వతంత్ర అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
మంత్రి దారుణ ఓటమి
అరకులో వాస్తవానికి ఎస్టీ ఎస్సీ ఓటింగ్ ఎక్కువ. ఆ తర్వాత బిసి వోటింగ్ ఎక్కువ. కాపు క్షత్రియ ఓటింగ్ నామమాత్రంగా ఉంటుంది. ఎస్టీ ఓటింగ్ మాత్రం లక్ష పైనే ఉంటుంది. టీడీపీకి ఇక్కడ అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలుపొందిన కిడారి సర్వేశ్వరరావు తర్వాత అధికార టిడిపి లో జాయిన్ అయ్యారు. ఆయన మావోయిస్టుల చేతిలో హత్యకు గురికావడంతో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో శ్రావణ్ దారుణంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా యాక్టివ్ గా లేరు. నియోజకవర్గం లో ఉండట్లేదు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదు. పార్టీ సమావేశాలకు హాజరు కావడం లేదు శ్రావణ్.
టీడీపీ అభ్యర్థి మార్పు ఖాయం
అందుకే ఇప్పుడు 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మంచి ఓటింగ్ తెచ్చుకున్న దొన్ను దొర టీడీపీకి అభ్యర్థి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన టిడిపిలో చేరారు. యాక్టివ్ గా ఉన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. టీడీపీకి మొదటినుంచి సివేరి సోమ కుటుంబం అండగా ఉంటుంది. అందుకే ఆ కుటుంబం నుండి వచ్చిన దొన్ను దొరకు సీటు ఇవ్వాలన్న ఆలోచన టిడిపి చేస్తోంది. శ్రవణ్ వచ్చినా రాకున్నా, పార్టీలో ఉన్నా లేకున్నా దొరకే సీటు ఇవ్వాలని టీడీపీ ఫిక్స్ అయినట్టు సమాచారం. అరకులో టీడీపీ అభ్యర్థి మార్పు ఖాయం గా కనబడుతుంది. వైసిపి సేఫ్ జోన్ లోనే ఉంది. ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ నియోజకవర్గంలో స్ట్రాంగ్ గా ఉన్నారు. చిన్న చిన్న అసంతృప్తులు, జిల్లా నాయకత్వం పై క్యాడర్ కు అసంతృప్తి ఉన్నప్పటికీ వైసిపి స్ట్రాంగ్ గానే ఉంది.