Atmakur By Poll: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ గురువారం చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకూ 61.75 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ఆరు గంటల వరకూ క్యూలైన్ లో ఉన్న వారందరికీ ఓటింగ్ కు అనుమతి ఇచ్చారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఆరు గంటల తరవాత కూడా క్యూలైన్ లలో ఓటర్లు ఉన్నారు. అయితే ఎక్కువ శాతం పోలింగ్ కేంద్రాల్లో ఆరు గంటల సమయానికే ఖాళీగా ఉండటంతో పోలింగ్ కేంద్రాలను అధికారులు మూసివేసి ఈవీఎంలను తరలించే ప్రక్రియను ప్రారంభించారు. పలు పోలింగ్ కేంద్రాల సమీపంలో వైసీపీ, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రధాన రాజకీయ పక్షాలైన టీడీపీ, జనసేన లు పోటీలో లేకపోవడంతో వైసీపీ మెజార్టీ అంచనాలపైనే లెక్కలు వేసుకుంటోంది. ఎన్నికల బరిలో వైసీపీ, బీజేపీతో సహా 14 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా భరత్ కుమార్ యాదవ్ లు రంగంలో ఉన్నారు. వైసీపీ ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీని సాధించాలన్న లక్ష్యంతో ఉంది. 70 శాతంకుపైగా పోలింగ్ నమోదు అవుతుందని వైసీపీ వర్గాలు భావించినా 62, 63 శాతం మించే పరిస్థితి లేదు. ఆత్మకూరు మండలం బట్టేపాడు పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులకు, స్వతంత్ర అభ్యర్ధి శశిధర్ రెడ్డికి మధ్య వాగ్వివాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్దే ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని శశిధర్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.
ఉప ఎన్నికల సందర్భంలో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని బీజేపీ నేతలు ఆరోపించారు. మర్రిపాడు మండలం కృష్ణాపురం పోలింగ్ కేంద్రంలో బీజేపీ ఏజెంట్ విష్ణును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని అభ్యర్ధి భరత్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ, ఎలక్షన్ కమిషనర్ కు దృష్టికి తీసుకువెళ్లినట్లు బీజేపీ నేతలు తెలిపారు. పడమటి నాయుడుపల్లి పోలింగ్ కేంద్రం వద్ద గుంపులు గుంపులుగా ప్రజలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయగా వారు పోలీసులపై ఎదురుదాడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ వెంటనే పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. మొత్తం మీద పోలింగ్ చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 26వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.