Big Breaking; వైసీపీ అదినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తిరుపతి పర్యటన రద్దు అయ్యింది. తొలుత ఈ నెల 14వ తేదీన తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ పాల్గొంటారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనూ కేసులు ఏక్కువగా నమోదు అవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది మృతి చెందగా అందులో నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు. నెల్లూరు జిల్లాలోనే ఒక్క రోజు 292 కేసులు నమోదు అయ్యాయి. దీంతో తిరుపతి పార్లమెంట్ ఓటర్లకు జగన్ బహిరంగ లేఖ రాశారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున రాలేకపోతున్నానని పేర్కొన్నారు.
తాను ఎన్నికల ప్రచారానికి వస్తే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు సభకు హజరు అవుతారని, దీని వల్ల మళ్లీ కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని జగన్ లేఖలో పేర్కొన్నారు. బాధ్యత కల్గిన సీఎంగా తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ఇటీవల తాను రాసిన లేఖలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ వివరించానన్నారు. ప్రభుత్వ పనితీరును గుర్తించి తన సోదరుడు డాక్టర్ గురుమూర్తి ఎన్నికల గుర్తు ఫ్యాన్ కు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
మరో పక్క తెలుగుదేశం పార్టీలో కరోనా కలకలం మొదలైంది. తిరుపతి ఉప ఎన్నికల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పలువురు టీడీపీ ఎమ్మెల్యే,లు, మాజీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, మాజీ మంత్రి జవహర్, ఎమ్మెల్సీ సంధ్యారాణి, వంగలపూడి అనిత లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారు ప్రచారం నుండి నేరుగా హైదరాబాద్ కు వెళ్లిపోయారు.