YS Viveka Case: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా (వివేకానందరెడ్డి) హత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారురాలైన వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, తొలుత కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై కోర్టు యండార్స్ కేసు నమోదు అయ్యింది. వీరిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసారు.
వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారంటూ ఆయన పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కొందరు నేతల పేర్లు చెప్పాలంటూ సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్ తనపై ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని, ప్రత్యేకంగా ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి తెస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు.
అప్పట్లోనే తాను ఎస్పీగా ఉన్న అన్భురాజన్ ను కలిసి తనకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇవ్వడంతో పాటు తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా ప్రయోజం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్ లో కృష్ణారెడ్డి పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు .. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టి సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వారిపై ఐపీసీ సెక్షన్ 156 (3) కింద పులివెందుల పోలీస్ స్టేషన్ లో వారిపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో అసలైన దోషులను శిక్షించాలని వివేకా కుమార్తె సునీత న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పై సునీత అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, కుటుంబ కలహాలు, ఆర్ధిక వ్యవహారాల నేపథ్యంలో వివేకా హత్య జరిగిందని, సునీత భర్త రాజశేఖరరెడ్డి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఇప్పటికే ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడుగా చేర్చగా, ఆయన హైకోర్టు బెయిల్ పొందారు. అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి తదితర నిందితులను సీబీఐ అరెస్టు చేయగా, చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.