CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సారి హస్తినకు వెళ్లి రావాల్సిన పరిస్థితి ఉంది. రీసెంట్ గా 11 మంది తో రేవంత్ సర్కార్ కొలువు తీరిన సంగతి తెలిసిందే. మంత్రివర్గంలో మరో ఆరుగురిని తీసుకునే అవకాశం ఉంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావడంతో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలి, ఏయే శాఖలు కేటాయించాలి తదితర విషయాలు అన్నీ పార్టీ హైకమాండ్ సూచనలు, సలహాల మేరకే చేస్తున్నారు అనేది బహిరంగ రహస్యమే.
అందుకే మరో మారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు. రేపు (19వ తేదీ,మంగళవారం) ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో రేవంత్ భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల అంశంపై పార్టీ అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి రెండో మారు ఢిల్లీకి వెళుతున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారి ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత మంత్రులకు శాఖల కేటాయింపు చేశారు.
త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందుగానే పదవులు పంపిణీ చేయడం ద్వారా పార్టీలో ఊపును కొనసాగించాలని రేవంత్ భావిస్తున్నారు. లోక్ సభ అభ్యర్ధుల ఎంపిక విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్దం చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. పరిపాలనలో తన మార్క్ చూపుతున్న రేవంత్ రెడ్డి..పాలనలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుమారు నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు వస్తుండటంతో ఈ ఎన్నికల్లో ఫలితాలు ఆయన సమర్ధతకు గీటురాయిగా మారుతుంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను లోక్ సభ ఎన్నికల్లోపుగా అమలు చేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని, తద్వారా పార్టీ హైకమాండ్ వద్ద తన పరపతి తగ్గకుండా చూసుకోవచ్చు అన్న ఆలోచనలో రేవంత్ ఉన్నట్లుగా తెలుస్తొంది. అందుకే ఈ లోపుగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టడంతో పాటు కీలక నామినేటెడ్ పోస్టులను పార్టీ కోసం గట్టిగా పని చేసే నాయకులకు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.
త్వరలో మంత్రి వర్గ విస్తరణ చేయనున్న నేపథ్యంలో పలు కీలక మంత్రిత్వ శాఖలను పెండింగ్ లో పెట్టారు. హోంశాఖ, విద్యాశాఖ, సంఘీక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖలను ఎవరికీ కేటాయించలేదు. ప్రస్తుతం ఈ శాఖలు అన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో ఎవరెవరికి చాన్స్ దక్కే అవకాశం ఉందన్నదానిపై పలు ఊహగానాలు వినబడుతున్నాయి. ఆరు మంత్రి పదవులు ఉండగా, డజను మందికి పైగా పోటీ పడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రస్తుత మంత్రి వర్గంలో ప్రాధాన్యం దక్కలేదు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ కైవశం చేసుకున్న నేపథ్యంలో ఓటమి పాలైన సీనియర్ నేతలకు మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అనే దానిపై సందిగ్దత కొనసాగుతోంది. అయితే రేవంత్ రెడ్డి ఇప్పటికే తన టీమ్ లో ఎవరెవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై ఒక క్లారిటీతో ఉన్నారని అంటున్నారు. గ్రేటర్ లో పార్టీ బలోపేతానికి సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కి ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రీసెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలైన సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు ను లోక్ సభ ఎన్నికల బరిలో దింపాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.
ఈ తరుణంలో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం షబ్బీర్ ఆలీకి, బీసీ వర్గానికి చెందిన అంజన్ కుమార్ యాదవ్ కు మంత్రులుగా అవకాశం కల్పించి వారిని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారని అంటున్నారు. ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి కోసం సీటు మారిన షబ్బీర్ ఆలీకి మంత్రి పదవి హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ముస్లిం మైనార్టీ వర్గానికే చెందిన ఫిరోజ్ ఖాన్ కూడా మంత్రి పదవి ఆశిస్తుండంతో వీరిలో ఒక్కరికి మాత్రం ఛాన్స్ దక్కుతుందని అంటున్నారు.
మరో పక్క ఎన్నికలకు ముందు బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన గడ్డం బ్రదర్స్ (గడ్డం వివేక్, గడ్డం వినోద్) మంత్రి పదవి రేస్ లో ఉన్నారు. మంత్రి పదవి కోసం వీరు ఇప్పటికే పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కూడా కలిసినట్లు వార్తలు వినబడుతున్నాయి. రేవంత్ రెడ్డి తనకు అవకాశం కల్పిస్తారన్న నమ్మకంతో గడ్డం వివేక్ ఉన్నారు. అలానే భోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఉమ్మడి రంగారెడ్డిజిల్లాకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి లు మంత్రి పదవి రేసులో ఉన్నట్లుగా తెలుస్తొంది. మరో పక్క కీలకమైన హోంశాఖను ఎవరికి కేటాయిస్తారన్న ఆసక్తి తెలంగాణ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
Big Breaking: దావూద్ ఇబ్రహీంపై విఫప్రయోగం ..? కరాచీ ఆసుపత్రిలో చికిత్స..అసలు విషయం ఏమిటంటే..?