Breaking: ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ఏపి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జివోలను సవాల్ చేస్తూ .. దాఖలైన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ జరిపింది. జీవోలో పేర్కొన్నట్లుగా రికవరీలు లేకుండా జీతాలు చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వేతనాల్లో రికవరీ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఏ ఒక్క ఉద్యోగి జీతం నుండి రికవరీ చేయెద్దని ఆదేశించింది. రికవరీ చేయకుండానే జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై మూడు వారాల్లో సమగ్ర కౌంటర్ ను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.
Breaking: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
నూతన పిఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు అన్నీ ఏకమైన పీఆర్సీ సాధన సమితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ సమితి ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. నూతన పిఆర్సీ జీవోలను ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతుండగా, ప్రభుత్వం మాత్రం కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు అంటూ అందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగులు తమ ఉద్యమ కార్యాచరణలో భాగంగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో నూతన పిఆర్సీ జీవోల వల్ల ఉద్యోగులకు జరిగే నష్టాన్ని వివరిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ చేపట్టిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.