విజయవాడలో నూతన కోర్టు భవనాల సముదాయాన్ని శనివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కలిసి నూతన కోర్టు భవన సముదాయాలను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో సీజేఐ జస్టిస్ వెంకట రమణ, సీఎం వైఎస్ జగన్ మొక్కలు నాటారు.
జీ ప్లస్ 7 నూతన కోర్టు భవనంలో 29 విశాలమైన ఏసి కోర్టుల హాళ్లు, ఏడు లిఫ్టులు, న్యాయవాదులకు, కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు, క్యాంటిన్ సహా అన్ని సదుపాయాలతో నూతన కోర్టు భవనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకు ముందు రాష్ట్రాలకు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఈ భవన సముదాయాలకు భూమి పూజ చేసిన జస్టిస్ వెంకట రమణ నేడు సీజేఐ హోదాలో ప్రారంభోత్సవం చేయడం విశేషం. ఈ నెల 26వ తేదీన సీజేఐ గా ఎన్వీ రమణ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. సీజేఐ హోదాలో జస్టిస్ ఎన్వీ రమణ స్వరాష్ట్రంలో చివరి పర్యటనలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు.
సీజేఐ జస్టిస్ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు
కోర్టు భవనాల ప్రారంభోత్సవానికి ముందు విజయవాడ నోవాటెల్ హోటల్ లో బస చేసిన సీజేఐ జస్టిస్ వెంకట రమణతో తొలుత సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. సతీమణి భారతి సహా నోవాటెల్ కు విచ్చేసిన సీఎం వైఎస్ జగన్ ..జస్టిస్ వెంకట రమణను మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు వీరి బేటీ సాగింది. తదుపరి ప్రతిపక్ష నేత చంద్రబాబు నోవాటెల్ కు విచ్చేసి జస్టిస్ వెంకట రమణను కలిశారు. కొద్దిసేపు ముచ్చటించారు. దాదాపు 20 నిమిషాలు సమావేశమైయ్యారు. ఆయనను శాలువాతో సత్కరించారు.