Breaking: అమరావతి రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజధాని అమరావతి అంశానికి ప్రభుత్వం, రైతులు వేసిన పిటిషన్లకు సంబంధిచి సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. త్రిసభ్య ధర్మాసనంలో న్యాయమూర్తి రవీంద్రభట్ అందుబాటులో లేకపోవడంతో సీజేఐ యూయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సమయంలో రైతులు తరపు న్యాయవాది సుందరం గతంలో తమరు ఏపి ముఖ్యమంత్రికి పలు అభిప్రాయాలను తెలియజేశారంటూ సీజేఐ యూయు లలిత్ కు గుర్తు చేశారు.
‘అవునా .. ఆ విషయం తనకు గుర్తు లేదు. ఏ విషయాలపై అభిప్రాయాలు ఇచ్చానో చెప్పగలరా’ అని సీజేఐ జస్టిస్ లలిత్ ప్రశ్నించగా, రైతుల తరపు న్యాయవాది సుందరం అందుకు సంబంధించిన వివరాలను ధర్మాసనానికి ఇచ్చారు. దీంతో వేరే బెంచ్ ముందు ఈ పిటిషన్లు విచారించాలంటూ పేర్కొంటూ సీజేఐ జస్టిస్ యుయు లలిత్ ధర్మాసనం నుండి తప్పుకున్నారు. వీలైనంత త్వరగా విచారణకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ ఆదేశించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ నాట్ బిఫోర్ మి అని తప్పుకోవడంతో ఈ రోజు రాజధాని అమరావతి పిటిషన్లపై ఎలాంటి విచారణ జరగకుండానే ముగిసింది.
గతంలోనూ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనూ జస్టిస్ యుయు లలిత్ ..జగన్మోహనరెడ్డికి సంబంధించి ఓ కేసులో ధర్మాసనం నుండి తప్పుకున్నారు. సుప్రీం కోర్టు న్యాయవాదిగా పని చేస్తున్న సమయంలో జగన్మోహనరెడ్డికి సంబంధించి కేసుల్లో వాదనలు వినిపించినందున ఆనాడు న్యాయమూర్తిగా ధర్మాసనం నుండి తప్పుకున్నారు. ఇప్పుడు మరో సారి ప్రధాన న్యాయమూర్తిగా కేసు నుండి తప్పుకున్నారు.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్నఏపి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయగా, తమ వాదనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని రైతులు పిటిషన్లు వేశారు. రాజధాని పరిరక్షణ సమితి సమితి, రైతులు కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు.