గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ రెండవ రోజు పర్యటన కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంత బాధితులను సీఎం జగన్ నేరుగా పరామర్శిస్తూ వారి సమస్యలు, తక్షణం అందిన సాయం వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి పరిహారం చెల్లించడానికి రూ.20వేల కోట్లు అవసరమనీ, ఆ ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నామన్నామని పేర్కొన్నారు సీఎం జగన్. వెయ్య కోట్లో, రెండు వేల కోట్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చేవాళ్లమనీ, అంత పెద్ద మొత్తం పరిహారం కాబట్టే కేంద్రం సాయం చేయాల్సిందేనన్నారు. పోలవరం పునరావాసం అంతా కేంద్రం చేతుల్లోనే ఉందని జగన్ అన్నారు. ఆ సాయం కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎలా అయినా సెప్టెంబర్ లోగా పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. పరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని నిర్వాసితులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు.
కోనసీమ జిల్లా లంక గ్రామాల్లో పర్యటించి రాజమహేంద్రవరంలో రాత్రి బస చేసిన సీఎం జగన్ .. ఈ రోజు (బుధవారం) అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కుయుగుడ, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశమైయ్యారు. వరదలతో నష్టపోయిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదనీ, ప్రతి ఒక్కరికీ పరిహారం అంది తీరుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆ తరువాత ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయ్యగూట్ట గ్రామానికి చేరుకుని వరద బాధిత గ్రామాలకు సంబంధించి ఫోటో గ్యాలరీని తిలకించారు. తదుపరి తిరుమలాపురం, నార్లవరం గ్రామాల్లో వరద బాధితులను పరామర్శించనున్నారు.