CM YS Jagan: ఏపి సచివాలయం ప్రధాన గేటు వద్ద దిశ పెట్రోలింగ్ వాహనాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్ లో 900 ద్విచక్ర వాహనాలు ఉన్నాయన్నారు. వీటితో పాటు మూడువేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో కోటి 16 లక్షల మంది అక్కా చెల్లెమ్మలు దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారన్నారు.
CM YS Jagan: ప్రమాదం జరిగితే పది నిమిషాల వ్యవధిలోనే సాయం
మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదని సీఎం జగన్ అన్నారు. ఈ దిశ వాహనాలు జీపీఎస్ ద్వారా కంట్రోల్ రూమ్ కి అనుసంధానమై ఉంటాయనీ, ఏదైనా ప్రమాదం జరిగితే పట్టణాల్లో 4-5 నిమిషాల్లో, గ్రామాల్లో 9-10 నిమిషాల్లో దిశ సిబ్బంది అక్కడకు చేరుకుంటారని చెప్పారు. మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిశ పెట్రోలింగ్ వాహనాలకు రూ.13.85 కోట్లు, రెస్ట్ రూమ్స్ కి రూ.5.5 కోట్లు వెచ్చించినట్లు సీఎం జగన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కె మోషేన్ రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, డీఐజీ పాల్ రాజు, దిశ స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.