విశాఖలోని గాజువాకలో నెలకొల్పిన అత్యంత ఎతైన గణనాధుడికి విగ్రహానికి ముప్పు పొంచి ఉందని అధికారులుగుర్తించారు. గాజువాకలో గణేష్ ఉత్సవ కమిటీ 89 అడుగుల భారీ వినాయక మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అయితే విగ్రహం ఒక అడుగు మేర పక్కకు ఒరిగిపోవడంతో విగ్రహం ఎక్కడ కింద పడిపోతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ గణేష్ విగ్రహానికి నిమజ్జన ఊరేగింపు జరుగుతున్న క్రమంలో విగ్రహం కుప్పకూలిపోయిన నేపథ్యంలో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు వెంటనే మండపానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ విషయాన్ని ఆర్ అండ్ బీ అధికారులకు తెలియజేసి విగ్రహాన్ని తనిఖీ చేయాలని కోరారు. పోలీసు అధికారుల సూచనతో ఆర్ అండ్ బి అధికారులు విగ్రహాన్ని తనిఖీ చేసి ప్రమాదానికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
రికార్డు సృష్టించిన బాలాపూర్ గణేష్ లడ్డూ..వేలంలో ఈ సారి ధర ఎంత పలికింది అంటే..?
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాల్లోనే ఇది అత్యంత ఎతైన విగ్రహం కావడంతో నిత్యం వేలాది మంది వినాయకుడిని దర్శించుకుంటున్నారు. ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విగ్రహానికి వంద మీటర్ల లోపు ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు. అదే విధంగా వెంటనే నిమజ్జనం చేయాల్సిందిగా పోలీసులు ఉత్సవ కమిటీని ఆదేశించారు. అయితే తాము ఈ నెల 18వ తేదీ నిమజ్జనోత్సవం జరపాలని నిర్ణయించుకున్నామనీ, ఇప్పుడు కుదరదని ఉత్సవ కమిటీ తొలుత తెలిపింది. ఓ పక్క రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున విగ్రహం పడిపోయే ప్రమాదం ఉందని ఆర్ అండ్ బీ, పోలీస్ అధికారులు తెలియజేసిన నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఉత్సవ కమిటి నిర్వహకులు.. సోమవారం సాయంత్రం నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. మరో పక్క విగ్రహానికి పొంచి ఉన్న ప్రమాదం వార్తలను గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహకులు కొట్టిపారేస్తున్నారు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. అయినప్పటికీ అధికారుల ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు.
15 నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు .. ఈ సమావేశాల్లో పకడ్బందీగా మూడు రాజధానుల బిల్లు..?