White fungus: కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో బ్లాక్ ఫంగస్ కేసుల ఉదంతం మరింత ఆందోళన రేకెత్తించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా బీహార్, తదితర రాష్ట్రాల్లో బయటపడ్డ వైట్ ఫంగస్ తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనూ పలువురికి సోకిందని పలు మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్లోని పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో బ్లాక్ ఫంగస్ తో పాటుగా వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్లు సోకిన పేషెంట్లు చికిత్స పొందుతున్నారని ఆ కథనాలు పేర్కొంటున్నాయి.
నగరం నడిబొడ్డున…
నగరం నడిబొడ్డున ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రితో బ్లాక్ ఫంగస్ చికిత్స పొందుతున్న ఓ మహిళకు వైట్ ఫంగస్ కూడా సోకినట్లు డాక్టర్లు తేల్చారు. కరోనా, స్టిరాయిడ్స్ వాడకంతో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్లే ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎటాక్ చేస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. బ్లాక్ ఫంగస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. ప్రాథమిక దశలోనే చికిత్స పొందితేనే కోలుకుంటారని, ఆలస్యం చేస్తే ఇన్ఫెక్షన్ బ్రెయిన్ వరకూ పోతుందని హెచ్చరించారు. ఇదే సమయంలో వైట్ ఫంగస్ కు మందులు అందుబాటులో ఉన్నాయని, బ్లాక్ ఫంగస్ మందుల కొరత ఉందని వైద్యులు పేర్కొనడం ఆందోళనకు కారణంగా మారుతోంది.
గాంధీ ఆస్పత్రిలో మారుతున్న సీన్..
ఇదిలాఉండగా, బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. కరోనా నోడల్ కేంద్రంగా చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం 25 కేసులు ఉండగా శనివారం నాటికి 96 మంది అడ్మిట్ అయినట్లు సమాచారం. బ్లాక్ ఫంగస్ వ్యాధి తీవ్రత ఉన్నవాళ్లకు ఆపరేషన్లు చేయడానికి గాంధీ హాస్పిటల్లో ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్లో ఏర్పాట్లు చేశారు. బ్లాక్ ఫంగస్ నోడల్ కేంద్రంగా కోఠి ఈఎన్టీ ఆసుపత్రిని ప్రకటించినా.. అక్కడ నాన్ కొవిడ్ పేషెంట్లను మాత్రమే అడ్మిట్ చేసుకుంటుండటం వల్ల గాంధీలో చికిత్స అందిస్తున్నారు.