IPS ABV: సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై మరో సారి క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. చంద్రబాబు హయాంలో ఏపి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు నిర్వహించారు,. ఆ సమయంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారన్న అబియోగంపై ఏబి వెంకటేశ్వరరావును జగన్ సర్కార్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ అనంతరం ఏబీవీ చేసిన వ్యాఖ్యలను జగన్ సర్కార్ సీరియస్ గా తీసుకున్నది. ఐపీఎస్ గా ఉంటూ ప్రభుత్వ ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా ఏబీవీ వ్యాఖ్యలు చేశారని తాజా అభియోగం దాఖలు చేసింది. 30 రోజులలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించారని మరోసారి ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర అధికారులపై ఇటీవల ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీసు అధికారుల సంఘం ఘాటుగా స్పందించింది. ఇటీవల ఏబీవీ వివేకా హత్య కేసు విషయంపై సీబీఐకి లేఖ రాశారు. ఆ లేఖలో డీజీపీ సవాంగ్, ఇతర పోలీస్ అధికారులపై వ్యాఖ్యలు చేశారు. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.