ఆంధ్రప్రదేశ్లోని హిందూ దేవాలయాల్లో జరుగుతున్న బాధాకరమైన ఘటనలు అనేకమందిని మతాలకు అతీతంగా కలచివేస్తున్న సంగతి తెలిసిందే.
అదే సమయంలో దీనిపై రాజకీయ విమర్శలు ప్రతివిమర్శలు జరుగుతున్నాయి. అయితే, దీనిపై ప్రధానంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ మరో సంచలన విమర్శ చేసింది.
హిందువుల మతమార్పిడులే అసలు ఉద్దేశం
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మీడియాతో మాట్లాడుతూ హిందువుల్లో భయాన్ని సృష్టించి .. బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నేత ఆరోపించారు. ఇప్పటి వరకు 140కి పైగా దేవాలయాలపై దాడులు జరిగినా.. ఒక్కరిని ఎందుకు అరెస్టుచేయలేకపోయారని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ విధానంపై అనుమానాలు కల్గుతున్నాయన్నారు. నిరుపేద హిందువులను భయపెట్టి మతం మార్చడం రాష్ట్రంలో సర్వసాధారణమై పోయిందని కలకలం సృష్టించే వ్యాఖ్యలు చేశారు.
రామతీర్థం ఘటనపై దూకుడు
విజయనగరంలోని రామతీర్థంలో కోదండ రాముని విగ్రహం ద్వంసం ఘటన రోజురోజుకి రాజకీయ రంగు పులుముకుంటున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఐదు ప్రత్యేక బృందాలతో పాటు ఇంటలిజెన్స్, సిఐడి, స్పెషల్ బ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించి .. అనుమానం ఉన్న ప్రతీ ఒక్కరిని విచారిస్తున్నారు. జిల్లాకు చెందిన ఐదు ప్రత్యే క బృందాలతో పాటు ఇంటలిజెన్స్ , సిఐడి, స్పెషల్ బ్రాంచ్ పోలీసులను ప్రభుత్వం రంగంలోకి దించింది. ముప్పై మందికి పైగా అనుమానితులను విచారిస్తున్నారు. మరోవైపు జిల్లాలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా సర్వమత పెద్దలతో కలిపి ప్రత్యేక కమిటీలను జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు .