YS Jagan : ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో చెప్పిన ఓ మాట సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలను, సాధారణ ప్రజానీకాన్ని ఆకట్టుకుంది. అది ఏమిటంటే తాను చంద్రబాబు మాదిరిగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించను అని తేగేసి చెప్పారు. ఈ నిర్ణయానికి ప్రశంసల వర్షం కురిసింది. గతంలో పార్టీలు మారిన నేతలను సంతల్లో పశువులను కొన్నట్లు కొనుగోలు చేశారు అనే విమర్శలు చేసే వారు. ఒక పార్టీ నుండి గెలుపొంది మరో పార్టీ మారే నాయకుల పట్ల ప్రజల్లోనూ సదాభిప్రాయం ఉండదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపిలతో పాటు పలువురు నేతలను పార్టీలో చేర్చుకున్నారు. ఆ పరిణామం నాడు ప్రతిపక్ష పార్టీని కొంత బలహీన పర్చినప్పటికీ, టీడీపీలో కొత్తగా చేరిన నాయకులకు, పాత నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు, వర్గ వైషమ్యాలు ఆ పార్టీకే తీవ్ర నష్టాన్ని కల్గించాయి. చివరకు ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం 23 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలకే టీడీపీ పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
YS Jagan : పార్టీ ఫిరాయింపులపై సొంత పార్టీలోనూ అసంతృప్తి
జగన్మోహనరెడ్డి ఇప్పుడు చంద్రబాబు తరహాలో కాకుండా పరోక్ష పధ్దతిలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వచ్చారు. వాస్తవానికి జగన్ కు ఏ పార్టీ నుండి ఎవరూ అవసరం లేదు. 151 మంది ఎమ్మెల్యేలతో పాటు 22 మంది పార్లమెంట్ సభ్యుల బలం ఉంది. రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఏకపక్ష తీర్పు ఇచ్చినా జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ సానుభూతి పరులుగా మార్చేసుకుంటున్నారు. ఇది ఆ పార్టీ నాయకులకూ నచ్చడం లేదు. వైసీపీకి చాలా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు కట్టబెట్టినా పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జగన్ ప్రభుత్వంలో ఉత్తి ఎమ్మెల్యేగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తమకు పదవులు రాలేదని కొందరు అసంతృప్తితో ఉండగా కొత్తగా చేర్చుకున్న ఎమ్మెల్యేలు, నాయకులతో వైసీపీలో గ్రూపు రాజకీయాలు మొదలు అయ్యాయి. గతంలో టీడీపీలో ఉన్న పరిస్థితి ఇప్పుడు వైసీపీలో కనబడుతోంది.
YS Jagan : వైసీపీలో మూడు ముక్కలాట
ప్రకాశం జిల్లా చీరాలలో రెండు సార్ల ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణ మోహన్ గత ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. ఈ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం గెలిచారు. టీడీపీలో కొనసాగితే తన కుమారుడు వెంకటేష్ రాజకీయ భవిష్యత్తు లేదని భావించిన కరణం బలరాం వైసీపీ గూటికి చేరారు. కుమారుడు వెంకటేష్ ను అధికారికంగా పార్టీలో చేర్పించారు. అదే విధంగా ఈ నియోజకవర్గంలో వైసీపీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా పని చేసిన పోతుల సునీత, పాలేటి రామారావు వంటి నాయకులను జగన్ వైసీపీలో చేర్చుకున్నారు. ఈ పరిణామంతో చీరాల నియోజకవర్గంలో మూడు గ్రూపులు అయ్యాయి. గత ఎన్నికల సమయంలో అనేక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆమంచి కృష్ణ మోహన్ చీరాలలో ఓటమి పాలైనా నియోజకవర్గంలో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. సామాజికవర్గ బలం లేకపోయినా 2014లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి వ్యక్తిగత ఇమేజ్ ఉందని రుజువు చేసుకున్నారు.
అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో కొత్త నేతల రాజకీయాల కారణంగా పార్టీ కోసం ఎప్పటి నుండో పని చేసిన తమకు అన్యాయం జరుగుతోందని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. టీడీపీ నుండి వైసీపీలో చేరిన కొందరు నాయకులకు పార్టీ అదిష్టానంతో సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు నేతల సహకారం కూడా లభిస్తుండటంతో చీరాలలో గ్రూపు రాజకీయం రసకందాయంగా మారిందట. పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరిగితే ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉంటుందని సగటు వైసీపీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుట, వైసీపీ ఊహించని విధంగా ఇప్పుడు స్థానిక ఎన్నికలు ముంచుకు వచ్చేశాయి. పార్టీ అధిష్టానం ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయని అంటున్నారు. చూడాలి ఎమి జరుగుతుందో.