ఏపీలో అధికార వైసీపీకి రాయలసీమ కంచుకోట. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీని పెట్టినప్పటి నుంచి రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు జగన్కు కొమ్ముకాస్తూ వస్తున్నాయి. ఇక రాయలసీమ, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో ప్రతి ఎన్నికల్లోను వైసీపీ తన ఆధిక్యం చాటుకుంటూ వస్తోంది. ఒక 2014 సాధారణ ఎన్నికలలో మాత్రం అనంతపురం జిల్లాలో తెలుగుదేశం ఆధిక్యంలోకి వచ్చింది. కడప, కర్నూలు, చిత్తూరు మూడు జిల్లాల్లో ఎప్పుడూ వైసీపీకి తిరుగులేకుండా పోతుంది.
పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీకి అస్సలు తిరుగులేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో నాలుగు జిల్లాలలో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం కేవలం మూడు స్థానాల్లో.. అదికూడా హిందూపురంలో బాలకృష్ణ, కుప్పంలో చంద్రబాబు, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మాత్రమే విజయం సాధించారు. మిగిలిన 49 నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో ఘనవిజయాలు సాధించారు. ఇక రాయలసీమలో ఉన్న ఎనిమిది పార్లమెంటు స్థానాలలో 8 చోట్ల కూడా వైసీపీ ఘనవిజయం సాధించింది.
దాదాపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గం లోను వైసీపీకి లక్ష ఓట్లకు పైనే మెజార్టీ రావడం విశేషం. అలాంటి కంచుకోటలలో ఈసారి పరిస్థితులు కొంచెం మారుతున్నాయి. జగన్ సొంత జిల్లా కడపలో మూడు నియోజకవర్గాలలో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉందని అనంతపురం, కర్నూలు జిల్లాలలో రెండు పార్టీలకు చెరి సగం సీట్లు వస్తాయని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా తెలుగుదేశం కచ్చితంగా ఐదు నుంచి ఏడు స్థానాలలో విజయం సాధిస్తుందని పలు సర్వేలు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంపై వైసీపీ వాళ్లకు కూడా క్లారిటీ ఉంది.
ఈసారి సీమలోని నాలుగు జిల్లాలలో తెలుగుదేశం 20 నుంచి 22 సీట్లలో విజయం సాధిస్తుందని వైసీపీలోనే కొందరు అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. అయితే రాయలసీమలో జరిగే డ్యామేజ్ను జగన్ చాలా వరకు ఉభయ గోదావరి జిల్లాలలో కవర్ చేసుకుంటున్నారని.. ఇందుకు అదిరిపోయే ప్లానింగ్తో ఎన్నికల వ్యూహాన్ని రచిస్తున్నారని తెలుస్తోంది. ఈసారి జగన్ గోదావరి జిల్లాలలో పూర్తిగా బీసీ ఈక్వేషన్ తో ముందుకు వెళుతున్నారు. ఏలూరు, నరసాపురం, రాజమండ్రి పార్లమెంటు స్థానాలను బీసీలకు కేటాయించారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో శెట్టి బలిజలకు విశేష ప్రాధాన్యం కల్పించారు.
ఉమ్మడి తూర్పుగోదావరిలో 19, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 15 మొత్తం 34 అసెంబ్లీ స్థానాలలో 12 నుంచి 15 స్థానాలలో వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చాలా వ్యూహాత్మకంగానే జగన్ స్ట్రాటజీతో వెళ్లి రాయలసీమలో జరిగిన డ్యామేజ్ ను ఉభయగోదావరి జిల్లాలలో కవర్ చేసుకునేలా దాదాపు సక్సెస్ అయ్యారని.. వైసీపీ వాళ్ళు చర్చించుకుంటున్నారు. అదే జరిగితే సీమలో జరిగిన డ్యామేజ్ గోదావరిలో కవర్ చేసుకొని.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ బాటలు పరుచుకుంటున్నట్టు క్లియర్గా కనపడుతోంది.