Pawan Kalyan: రాష్ట్రంలో నేరగాళ్లపై ఆంక్షలు లేవు కానీ తన పర్యటనపై ఆంక్షలు విధిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో విడత వారాహి యాత్ర లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటిస్తున్నారు. పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ పెద్ద సంఖ్యలో అభిమానులు రోడ్ల మీదకు వచ్చి అడుగడుగునా పవన్ కు స్వాగతం పలికారు. పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ లో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన కోటగిరి వరలక్ష్మి కుటుంబాన్ని శనివారం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓ వృద్ధురాలిని బంగారు ఆభరణాల కోసం వాలంటీర్ హత్య చేసి పది రోజులు కావొస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం తరపున ఒక్కరూ ఆమె కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. పాలకుల ఆలోచనా విధానం ఏమిటో ఈ విషయంలోనే అర్ధమవుతోందన్నారు.
వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ వ్యవస్థలోని కొంత మంది నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. పాస్ పోర్టు కావాలన్నా, చిన్న పాటి ఉద్యోగానికైనా పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు. కానీ వాలంటీర్ అనే ఈ సమాంతర వ్యవస్థలో ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు ఎందుకు పోలీస్ వెరిఫికేషన్ చేయడం లేదని పవన్ ప్రశ్నించారు. వైసీపీ తన కోసం వినియోగించుకునే వ్యవస్థను నిబంధనలు గాలికి వదిలి తయారు చేస్తొందని విమర్శించారు. ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్న వాలంటీర్లు అసలు ఎలాంటి వారో కూడా చూడకుండానే వారిని నియమించడం ఎంత వరకు సబబు అని పవన్ ప్రశ్నించారు.
వాలంటీర్ల ముసుగులో కొందరు చేస్తున్న దురాగతాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయని తెలిపారు. వీరిపై పర్యవేక్షణ లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో వారు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలను సక్రమంగా పని చేయిస్తే నేరాలు జరగవన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తగా విఫలం అయ్యాయని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30వేల మంది మహిళలు అదృశ్యమైయ్యారని తాను మాట్లాడితే అధికార పార్టీ నేతలు తనపై విరుచుకుపడ్డారనీ, పార్లమెంట్ సాక్షిగా తాను చెప్పింది నిజమని తేలిందన్నారు. అసలు చిన్నారుల అక్రమ రవాణాకు మూలం ఏమిటో..? మాయమైన చిన్నారులు ఏమవుతున్నారో ..? కుడా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో వ్యవస్థలు సక్రమంగా పని చేయనిస్తే ఇలాంటి నేరాలే జరగవని అన్నారు. వ్యవస్థలను బలోపేతం చేసి శాంతి భద్రతలను కాపాడటమే జనసేన లక్ష్యమని అన్నారు. కాగా సింహాచలం, వేపగుంట, సుజాతనగర్ కూడళ్లలో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. మార్గ మధ్యలో పలువురు పవన్ కళ్యాణ్ కు సమస్యలపై వినతి పత్రాలను సమర్పించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. రాష్ట్రంలో గ్రీన్ టాక్స్ పేరిట జరుగుతున్న దోపిడీని ట్రక్ డ్రైవర్ అప్పలరాజు పవన్ కళ్యాణ్ కు వివరించారు.
గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ టీడీపీలో చేరికకు మూహూర్తం ఫిక్స్ ..? రేపు ఆత్మీయ సమ్మేళనం