కృష్ణాజిల్లా గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు పార్టీ వీడి టీడీపీ గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా పార్టీలో అసంతృప్తిగా ఉన్న యార్లగడ్డ రాబోయే ఎన్నికల్లో గన్నవరం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో తనపై గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలో చేరడంతో యార్లగడ్డ కు నియోజకవర్గంలో ప్రాధాన్యత తగ్గింది. ఓటమి తర్వాత ఆయనకు కేడీసీసీ చైర్మన్ పదవి లభించినప్పటికీ నియోజకవర్గంలో వైసీపీ నుండి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు కేవలం 990 ఓట్ల తేడాతోనే అప్పటి టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీపై పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత వల్లభనేని టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరడంతో నియోజకవర్గంలో పరిస్థితి యార్లగడ్డ వర్సెస్ వల్లభనేనిగా మారింది.
కేడీసీసీ చైర్మన్ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన కొంత కాలం సైలెంట్ గా ఉన్నారు. ఇటీవల సీఎం జగన్ తో యార్లగడ్డ భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. ఈ క్రమంలో పలు మార్లు తన వర్గీయులతో సమావేశాలు నిర్వహించారు యార్లగడ్డ. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలంటే టీడీపీలో చేరడమే మేలన్న అభిప్రాయాన్ని ఆయన సన్నిహితులు సూచించారుట. గన్నవరం టీడీపీ ఇన్ చార్జి గా బాధ్యతలు నిర్వహించిన బచ్చుల అర్జునుడు మృతి తర్వాత ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు. దీనికి తోడు టీడీపీ సరైన అభ్యర్ధి కోసం ఎదురుచూస్తొంది. మరో పది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యార్లగడ్డ యాక్టివ్ అవుతున్నారు. గన్నవరం టీడీపీ క్యాడర్ కూడా యార్లగడ్డ చేరికను వ్యతిరేకించడం లేదుట.
పార్టీలో చేరితే అభ్యర్ధిత్వం ఖరారు చేసినట్లేనని భావిస్తున్నారు. అందుకే రేపు యార్లగడ్డ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారుట. ఈ సమావేశానికి వైసీపీలోని తన అనుచర వర్గంతో పాటు టీడీపీ నేతలను ఆహ్వానించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 19వ తేదీన నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో లోకేష్ సమక్షంలో పార్టీ లో చేరికకు మూహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇటీవల యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తాను ఓడిపోతే అమెరికా వెళ్లిపోతానని ప్రచారం చేశారనీ, కానీ తన వ్యాపారాల దృష్ట్యా రెండు మూడు సార్లు వెళ్లి వచ్చాననీ, ఇక్కడే ఉంటున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గన్నవరం నుండే పోటీ చేస్తానని తెలిపారు. ఈ తరుణంలో యార్లగడ్డ వెంకట్రావు పార్టీ వీడకుండా వైసీపీ అధిష్టానం ఏమైనా చర్యలు చేపడుతుందా లేక లైట్ తీసుకుంటుందా అనేది వేచి చూడాలి.
Tirumala: తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడి .. నెల్లూరు జిల్లా బాలిక మృతి