KCR: దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఒరవడిలో తెలంగాణ సీఎం కేసీఆర్ , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారింది. కరోనా నియంత్రణకు ఓవైపు ప్రయత్నిస్తూనే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాక్సినేషన్పై నజర్ పెట్టాయి. ఇదే ఒరవడిలో కరోనా కట్టడికి మరిన్ఇన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కేసీఆర్ డైనమిక్ నిర్ణయాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మునిసిపల్ మంత్రి కేటీఆర్ కోవిడ్ పాజిటివ్ బాధితులయ్యారు. వీరిద్దరు ఇంట్లో ఉంటూనే చికిత్స తీసుకుంటూ.. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని, నియంత్రణా చర్యలను, వ్యాక్సినేషన్ పంపిణీని సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. టీకా పంపిణీ కోసం జిల్లాల వారీగా ఇంఛార్జీలను నియమించాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణ జనాభాతోపాటు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి.. వివిధ రంగాలలో పని చేస్తున్న వారి సంఖ్య కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాల్సి వుంటుందని ప్రభుత్వం అంఛనా వేస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపు 36 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. మిగిలిన వారిలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ టీకా వేయాలని ప్రభుత్వం తలపెట్టింది. ఇందుకోసం సుమారు 2500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు.
జగన్ సైతం…
ఏపీలో సగటున రోజుకు పదివేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇదే పరిస్ధితి కొనసాగితే గత రికార్డులు కూడా బద్దలై భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అయ్యే ఛాన్స్ వుంది. ఇప్పటికే పాజిటివిటీ రేటులో గతేడాది (2020)లో నమోదైన రికార్డు బద్దలైంది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ రాత్రి పూట కర్ప్యూ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏపీలో 18 ఏళ్ళు మొదలుకుని అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 4 కోట్ల డోసులు కావాలంటూ కోవాక్సిన్, కోవీ షీల్డ్ తయారీ సంస్థలైన సీరం,భారత్ బయోటెక్ అధినేతలకు లేఖలు పంపారు.