ఏపి అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యింది. డిప్యూటి స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో డిప్యూటి స్పీకర్ గా కొద్ది సేపటి క్రితమే వీరభద్రస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామిని వైసీపీ, టీడీపీ సభ్యులు అభినందించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, సీఎం వైఎస్ జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడులు వీరభద్రస్వామిని స్పీకర్ కుర్చీలో కూర్చొబెట్టారు. స్పీకర్, డిప్యూటి స్పీకర్ పదవులు ఉత్తరాంధ్రకు లభించడం అరుదైన గౌరవమని డిప్యూటి సీఎం పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ డిప్యూటి స్పీకర్ గా ఎన్నికైనందున ఇక పై రాజకీయ పార్టీలతో సంబంధం లేదని అనుకుంటున్నాననీ, సభాపతి కుడివైపు చూస్తున్నందున మీరు ఎడమవైపు చూసి తమకు అవకాశం కల్పించాలని అచ్చెన్న కోరారు.
అనంతరం స్పీకర్ స్థానంలో కుర్చున్న వీరభద్రస్వామి స్వామి తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చైర్ లో కూర్చున్నంత సేపు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తాననీ, తాను ఈ సీటులోకి రావడానికి వైసీపీ అవకాశం కల్పించడం వల్ల వచ్చిందేనని పేర్కొన్నారు. బయట వైసీపీ సభ్యుడుగా ఉన్నా చైర్ లో ఉన్నంత వరకూ నిబంధనల మేరకు నడుచుకుంటానని చెప్పారు. అనంతరం టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించి సభకు టీ బ్రేక్ ఇచ్చారు. చైర్ లో కూర్చన్న వెంటనే తమ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం ఏమిటని టీడీపీ సభ్యులు ప్రశ్నించగా, తాను స్పీకర్ స్థానంలో కూర్చోకముందు ఈ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారని చెప్పారు.
ఇటీవల వరకూ డిప్యూటి స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించిన కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రెండున్నర సంవత్సరాల తర్వాత కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధికార వైసీపీ ముందుగా నిర్ణయించుకున్నందున కోన రఘుపతి ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో వైసీపీ .. డిప్యూటి స్పీకర్ గా ఆర్యవైశ్య సాామాజిక వర్గానికి చెందిన సీనియర్ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామికి అవకాశం కల్పించింది. శుక్రవారం కోలగట్ల నామినేషన్ దాఖలు చేయగా, ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. గత ఎన్నికల్లో విజయనగరం నుండి వైసీపీ తరపున ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.