Kuppam Municipality: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఛాలెంజ్ చేసినట్లు అన్నంత పని చేసి చూపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఆరంభం అయినప్పుడు ఎందుకైనా మంచిదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శాసనసభ్యుడుగా తన ఎక్స్ అఫిషియో ఓటును కుప్పం మున్సిపాలిటీలో నమోదు చేయించుకున్నారు. ఒక వేళ బొటాబొటీగా వార్డులు గెలిస్తే తన ఎక్స్ అఫిషియో ఓటుతో అయినా కుప్పం మున్సిపల్ చైర్మన్ సీటు టీడీపీ ఖాతాలో వేసుకోవచ్చు అని చంద్రబాబు అనుకున్నారో ఏమో.. ఆ సందర్భంలోనే చంద్రబాబుకు ఆ ఓటు వినియోగించుకునే అవకాశం రానివ్వమని చెప్పారు.
Kuppam Municipality: 25 లో 19 వార్డులు వైసీపీ కైవశం
కుప్పంలో మొత్తం 25 వార్డులు ఉండగా వైసీపీ 19 వార్డులు గెలుచుకుంది. టీడీపీ ఆరు స్థానాలకే పరిమితం అయ్యింది. బీజేపీ ఒక్క వార్డు కూడా కైవశం చేసుకోలేదు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీని ఓడించడం ద్వారా రాష్ట్రంలో టీడీపి పనైపోయింది అన్న సంకేతం ఇవ్వాలన్నది వైసీపీ అధినేత, సీఎం వైెఎస్ జగన్మోహనరెడ్డి లక్ష్యం. ఈ క్రమంలో కుప్పం బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు.
వర్క్ అవుట్ పెద్దిరెడ్డి స్ట్రాటజీ
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, లోకేష్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు పెద్దిరెడ్డి గట్టి సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల కుప్పం పర్యటనలో లోకేష్ పెద్దిరెడ్డి మీద పరోక్షంగా ఘాటైన విమర్శలు చేశారు. కుక్కలంటూ మాట జారారు. అయినా పెద్దిరెడ్డి సంయమనంతో వ్యవహరించారు. కుక్కలు అన్నావు సరే.. లెక్కలు చూద్దుగానివ్వంటూ..తన పని చేసి చూపించారు. కుప్పంలో వైసీపీ గెలుపునకు పక్కా స్ట్రాటజీ తో పెద్దిరెడ్డి ముందుకు సాగారు. పూర్తి ఆయన ఫ్యామిలీ మొత్తం కుప్పంలో మకాం వేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డిలను అక్కడే ఉంచారు. కార్యాచరణ కట్టుదిట్టంగా అమలు చేశారు. తండ్రీ, తనయులకు కోలుకోలేని విధంగా దెబ్బతీశారు.