Mekapati Goutham Reddy: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద జరిగిన గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, వైఎస్ భారతి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి చితికి నిప్పంటించారు. అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు.
తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. అంతిమయాత్రలో దారి పొడవునా పూలు చల్లుతూ గౌతమ్ రెడ్డికి నివాళులర్పించారు. తొలుత సీఎం వైఎస్ జగన్ దంపతులు తాడేపల్లి నుండి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్నారు. అక్కడ నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఉదయగిరికి వచ్చారు. అంత్యక్రియల అనంతరం సీఎం వైఎస్ జగన్ తిరిగి కడపకు చేరుకున్నారు. అక్కడ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్నారు.