కృష్ణాజ్లిలా గన్నవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడికి దిగారు. కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. కార్యాలయ ఆవరణలోని కారుకు నిప్పంటించారు. టీడీపీ, వైసీపీ నేతల వ్యాఖ్యలతో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రీసెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై గన్నవరం ఎమ్మెల్యే వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు వంశీపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై విమర్శలు చేసిన వంశీపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తమ నాయకుడినే విమర్శిస్తారా అంటూ వంశీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు.
కార్యాలయంలో కంప్యూటర్ లు , ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు. ఈ దాడి ఎమ్మెల్యే వంశీ అనుచరులే చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ కార్యాలయం వద్ద దాడి ఘటన నేపథ్యంలో చెన్నై – కోల్ కతా జాతీయ రహదారిపకి ఇరువైపులా టీడీపీ, వైసీపీ శ్రేణులు మోహరించాయి. అప్సర ధియేటర్ సమీపంలో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు ఈ క్రమంలో సీఐ కనకారావుకు గాయాలైయ్యాయి. హైవేపై మరింత ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అనంతరం టీడీపీ శ్రేణులు హైవేపై భైటాయించి ఆందోళనకు దిగారు. దీంతో మూడు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. ఈ ఘటనపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీకి రాజకీయ బిక్ష పెట్టిన టీడీపీ కార్యాలయంపై దాడికి దిగడం సిగ్గుచేటని విమర్శించారు. ఎమ్మెల్యే వంశీ, కొడాలి నాని తదితరులు టీడీపీ నుండి ఎందుకు బయటకు వెళ్లిపోయారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు.
బీసీలకు పెద్ద పీట .. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే