Nara Lokesh: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో బ్రేక్ పడిన యువగళం పాదయాత్రను నారా లోకేష్ తిరిగి ప్రారంభిస్తున్నారు. సోమవారం ఉదయం 10.19 గంటలకు పాదయాత్రకు లోకేష్ పాదయాత్రను పునఃప్రారంభిస్తున్నారు. విరామం ప్రకటించిన కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే పాదయాత్రను కొనసాగించనున్నారు. మధ్యాహ్నం తాటిపాక బహిరంగ సభలో లోకేష్ ప్రసంగిస్తారు. పి గన్నవరంలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో లోకేష్ ముఖాముఖి నిర్వహిస్తారు. మామిడికుదురు లో స్థానికులతో భేటీ అవుతారు. సోమవారం 16 కిలో మీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగనుంది. పాదయాత్ర కోసం ఇప్పటికే పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు.
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ను సెప్టెంబర్ 9న అరెస్టు చేయడంతో .. లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. దాదాపు 60 రోజుల తర్వాత చంద్రబాబుకు బెయిల్ లభించడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్ నుండి విడుదల అయ్యారు. ఈ మధ్యలో చంద్రబాబు బెయిల్ ప్రయత్నాల కోసం ఢిల్లీకి వెళ్లారు. మరో పక్క లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారన్న వార్తలు రావడంతో హైకోర్టును ఆశ్రయించారు. అయితే లోకేష్ విషయంలో సీఆర్పీసీ 41 నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలుపడంతో అరెస్టు లేదని తెలిసిపోయింది. రీసెంట్ గా చంద్రబాబుకు పూర్తి స్థాయిలో బెయిల్ లభించడంతో పాదయాత్ర కొనసాగించాలని లోకేష్ నిర్ణయించారు.
రాజోలు నియోజకవర్గం పొదలాడ నుండి యువగళం పాదయాత్ర పునః ప్రారంభించి అమలాపురం, ముమ్మడివరం, కాకినాడ పట్టణం, కాకినాడ రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా అనకాపల్లి జిల్లాలో ప్రవేశిస్తుంది. అనకాపల్లి, విశాఖ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకుని అక్కడ పాదయాత్ర ముగిస్తారు లోకేష్. లోకేష్ పాదయాత్ర ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో ప్రారంభమైంది. తొలుత కుప్పం నుండి ఇచ్చాపురం వరకూ 400 రోజులు 4వేల కిలో మీటర్లు పాదయాత్ర చేయాలని భావించినప్పటికీ చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది.
రెండున్నర నెలల పాటు పాదయాత్రకు విరామం ఇచ్చిన నేపథ్యంలో ఇచ్చాపురం వరకూ పాదయాత్ర లక్ష్యాన్ని కుదించుకుని విశాఖపట్నంలో ముగించనున్నారు. గతంలో చంద్రబాబు చేపట్టిన వస్తున్న మీ కోసం పాదయాత్ర కూడా విశాఖలోనే ముగించారు. ఆ సెంటిమెంట్ కూడూ కలిసి వచ్చేలా లోకేష్ విశాఖలో పాదయాత్ర ముగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తొంది. ఇందుకు తగినట్లుగా రూట్ మ్యాప్ ను ఖరారు చేసినట్లుగా సమాచారం.
MP Raghurama: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈడీ భారీ జరిమానా