జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఏపిలో మవోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి సోదాలు నిర్వహిస్తొంది. దివంగత మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) భార్య శిరీష నివాసంలో సోదాలు నిర్వహిస్తుంది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం అలకూరపాడులోని ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే విరసం నేత కళ్యాణరావు ఇంట్లోనూ ఎన్ఐఏ అధికారులు ఈ రోజు ఉదయం నుండి సోదాలు జరుపుతున్నారు. విజయవాడ సింగ్ నగర్ లో విరసం నేత దొడ్డి ప్రభాకర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. విరసం నేతలపై ఇటీవల విశాఖ జిల్లా పెద్దబయలులో కేసు నమోదు అయ్యింది.
ఎన్ఐఏ అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుండే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ సోదాలు ఎందుకు నిర్వహిస్తున్నారు ? సోదాల్లో ఏమైనా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారా? అనే దానిపై ఇంక స్పష్టత లేదు. సోదాలు జరుపుతున్న విషయాన్ని ఎన్ఐఏ అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. మధ్యాహ్నానికి ఈ సోదాలు ఎందుకు నిర్వహించారు. ఏమైనా పత్రాలు లభించాయా అనే విషయాలు తెలిసే అవకాశం ఉంది.