Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి సంచలన కామెంట్స్ చేశారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామంలో సుమారు 210 బాధిత కుటుంబాలకు లక్ష వంతున సాయం చెక్కులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంపిణీ చేశారు. కౌలు రైతుల బాధలను తెలుసుకుంటూ, వారి కుటుంబ పెద్ద దూరం అయిన తర్వాత వారు పడిన ఇబ్బందులు అడిగి తెలుసుకుని వారిని ఓదార్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ .. తనను తిడుతున్న వైసీపీ నేతలను గాడిదలతో పోలుస్తూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని, ప్రజలు అందరూ కోరుకుంటే తాను సీఎం అవుతానని అన్నారు. వైసీపీని అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత తనదన్నారు. అంబటిది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వమని విమర్శించారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని ఆయన ఓ మంత్రా అని ప్రశ్నించారు. తనపై బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నాయకులకు సరైన సమాధానం చెబుతానన్నారు.
తాను ఏ పార్టీకి కొమ్ముకాయననీ, ఏ పార్టీకి అమ్ముడుపోయే ఖర్మ తనకు పట్టలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. తన సినిమాలు ఆపేసినా భయం లేదని పేర్కొన్నారు. పోరాటం చేయనిదే మార్పు రాదని, ఈ విషయాన్ని జనసేన నేతలు గుర్తుంచుకోవాలన్నారు. జనసేన నాయకులు బాధ్యతగా పని చేయాలని సూచించారు. కేసులు పెడతారని భయపడవద్దని, ధైర్యంగా నిలబడాలని అన్నారు. తనపై లాఠీ పడితే రక్తం చిందించడానికైనా సిద్దమేనన్నారు. జైలులో కూర్చోవడానికి కూడా వెనుకాడనని అన్నారు. వచ్చే ఎన్నికలు హోరాహోరీగా ఉంటాయని పేర్కొన్నారు. అధికారం పోతుందని వైసీపీ వాళ్లు వచ్చే ఎన్నికల్లో గొడవలకు దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న విషయం తనకు వదిలివేయాలని తెలిపారు. జనసేనను అధికారంలోకి వచ్చే బాధ్యతను తనకు వదిలివేయాలన్నారు.
వీకెంట్ పొలిటీషియన్ అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై పవన్ స్పందిస్తూ వారానికి ఒక సారి వస్తేనే తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. తన వద్ద తాతలు సంపాదించిన ఆస్తులు లేవని, అక్రమాలు, దోపిడలు చేసిన డబ్బు లేదని అన్నారు. తనకు వందల కోట్లు, వేల కోట్లు అచ్చిన నాయకులు ఎవరూ లేరనీ, చిన్న వాళ్లు, కొత్త వాళ్లు, ఇంకా అధికారం చూడని వ్యక్తుల సమూహమే తన వద్ద ఉందని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనిచ్చే ప్రసక్తే లేదని, అందుకు తాను కట్టుబడి ఉన్నానని పవన్ స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో తన వారాహి వాహనంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపైనా స్పందించారు పవన్ కళ్యాణ్. వారాహి వాహనంలో ఏపీ రోడ్లపై తిరుగుతాననీ, ఎవరు ఆపుతారో తానూ చూస్తానని అన్నారు. ఒండ్రుతున్న గాడిదలు వస్తే తాను ఏమిటో అప్పుడు చూపిస్తానంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు, అభిమానులు, కౌలు రైతు కుటుంబాలు పాల్గొన్నారు.