Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగంలో తన బాణి మార్చారు. మొదటి సారిగా ప్రస్తుతం జగన్ సర్కార్ లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలపై మాట్లాడారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా సీఎం జగన్మోహనరెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నవరత్న సంక్షేమ పథకాలను అప్పులు చేసి మరీ కొనసాగిస్తున్నారు. జగన్మోహనరెడ్డి కాబట్టే ఇచ్చిన హామీ మేరకు వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలను యధావిధిగా అందిస్తున్నారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో వేరే ప్రభుత్వం వస్తే ఈ సంక్షేమ పథకాలను అమలు చేయరనే భయం కూడా ప్రజల్లో ఉంది. ప్రజల భయాన్ని గమనించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సంక్షేమ పథకలపై క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆదివారం విజయనగరం జిల్లా గుంకలాంలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు పవన్ కళ్యాణ్. మెరుగైన భవిష్యత్తు కోసం జనసేన పై నమ్మకం ఉంచాలనీ, మార్పు అంటే ఏమిటో చూపిస్తానని స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచితే గుండాలతో అయినా పోరాడతానని పునరుద్ఘాటించారు. ఉత్తరాంధ్ర జనసైనికులు కేసులకు భయపడవద్దని, కేసులు పెడితే తాను కూడా వస్తానని అన్నారు. రాజధాని పేరుతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వంచనను ఉత్తరాంధ్ర ప్రజలు ఇకనైనా తెలుసుకోవాలని, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి బలమైన రాజకీయ అధికారం దక్కాల్సిన అవసరం ఉందని అన్నారు. జగనన్న కాలనీ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని నిలదీశారు. ఇళ్ల నిర్మాణం పేరుతో రూ.12వేల కోట్ల అవినీతి చోటుచేసుకుందని పవన్ ఆరోపించారు.
మత్స్యకారులు ఉపాధి కోసం గోవా, ఇతర ప్రాంతాలకు వెళుతున్నారనీ, జనసేన అధికారంలోకి వస్తే ఇక్కడే జెట్టీలు నిర్మించి వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని పవన్ హామీ ఇచ్చారు. మత్స్యకారులకు హాని కలిగించే దేనినైనా జనసేన అడ్డుకుంటుందని తెలిపారు. అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దామని, అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకువద్దామని పవన్ కళ్యాణ్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం తన సినిమాల ద్వారా వచ్చే సొమ్ము రూ.30 కోట్లు కేటాయిస్తానని తెలిపారు. విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ కు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.