AP High Court: ఏపి మంత్రి ఉష శ్రీ చరణ్ అనుచరులపై హైకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సర్వే నెం.329 లో సుమారు వంద ఎకరాల్లో ఉన్న సుబేదార్ చెరువును మట్టితో పూడ్చి ప్లాట్ లుగా అమ్ముకోవాలని మంత్రి అనుచరులు చూస్తున్నారని ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి ఉమామహేశ్వరరావు పిటీషన్ దాఖలు చేశారు. చెరువు ఆక్రమణలపై స్థానిక రెవెన్యూ అధికారుల నుండి ఉన్నతాధికారుల వరకూ పిర్యాదు చేసినా ఫలితం లేదని అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఉమామహేశ్వరరావు తరపున న్యాయవాది యలమంజుల బాలాజీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, కలెక్టర్, ఆర్డీఓలను చేర్చారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు..రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
చెరువు ఆక్రమణలను అడ్డుకోకపోతే కళ్యాణదుర్గం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని టీడీపీ ఇన్ చార్జి ఉమామహేశ్వరరావ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ సర్వే నెం.329 లో 92.81 ఎకరాల భూమిని 1974 లో ల్యాండ్ సీలింగ్ చట్టం కింద ప్రభుత్వం తీసుకుందని రెవెన్యూ అధికారుల దృష్టికి ఉమా తీసుకువెళ్లారు. ఈ భూమిని సర్వే చేసిన అధికారులు అందులో 40 ఎకరాలు సుబేదార్ నీటి కుంటకు, 52.81 ఎకరాలను భూమిలేని నిరుపేదలకు పట్టా ఇచ్చేందుకు అభ్యంతరం లేదని అప్పట్లో నియమించిన కమిటీ తేల్చి చెప్పిందని అంటున్నారు. కళ్యాణదుర్గంలోని చెరువు ఆక్రమణ అంశం హైకోర్టుకు చేరడం, ఇందులో మంత్రి అనుచరులు ఉన్నారని ఆరోపణలు రావడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.