ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో మోడీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, బిజేపీ నేతలు స్వాగతం పలికారు. వర్షం కారణంగా ప్రధాన మంత్రి మోడీ 40 నిమిషాల ఆలస్యంగా విశాఖకు చేరుకున్నారు. అక్కడ నుండి నౌకాదళ గెస్ట్ హౌస్ ఐఎన్ఎస్ చోళకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. మరి కొద్ది సేపటిలో ప్రధాని మోడితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. తరువాత బీజేపీ కోర్ కమిటీ నేతలతో మోడీ సమావేశమవుతారు.
రేపు ఉదయం 10.10 గంటలకు బహిరంగ సభ ప్రాంగణానికి ప్రధాని చేరుకోనున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభలో ఎనిమిది మందికే అనుమతించారు. ప్రధానితో పాటు వేదికపై గవర్నర్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు, సీఎం రమేష్, బీజేపీ ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, పీవీఎన్ మాథవ్ మాత్రమే ఉంటారు. మోడీ పర్యటనలో భాగంగా పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం .. మధ్యాహ్నం ఐఎన్ఎస్ డేగా నుండి హైదరాబాద్ కు వెళ్లనున్నారు. మోడీ పర్యనట నేపథ్యంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖకు చేరుకున్నారు.