రాజకీయాలు కూర్రంగా ఉంటాయని.. తాజాగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ఔను. రాజకీయాలు ఎప్పుడూ అలానే ఉంటాయి. వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలోనే నాయకులు విఫలమవుతారు. 2022-23లో టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీలోకి రమ్మని రఘురామను ఆహ్వానించారు. కానీ, ఆ సమయంలో రఘురామ.. అనర్హత వేటుకు భయపడో.. లేక బీజేపీ నుంచి తనకు లాభం పోతుందని అనుకున్నారో.. కానీ, టీడీపీ చెంతకు చేరలేదు. వైసీపీలోనే ఉండి రెబల్గామారి.. తన వాదనను వినిపించారు. సీఎం జగన్పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
కొన్నాళ్లకు జగన్పైకేసులు కూడా వేశారు. అయితే.. ఇది తనకు అప్పటికి ఆనందాన్ని కలిగించింది. కానీ, ఇప్పుడు అంతిమం గా ఎన్నికల పోటీకి వచ్చేసరికి మాత్రం ఏకంగా టికెట్ లేకుండా చేసింది. పైగా.. ఇప్పుడు రఘురామ ఏ పార్టీలోనూ చేరలేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్డీయే పక్షాలకు ఆయన మద్దతు చెబుతున్నారు. అయితే.. నరసాపురంలో ఇప్పుడు బీజేపీ వేరే వారికి టికెట్ ఇచ్చేసింది. దీంతో రఘురామ పరిస్థితి ఏంటనేది ఆసక్తిగా మారింది. దాదాపు ఇప్పుడు ఉన్న పార్లమెంటు సీట్లు అన్నీ కూడా ఫిల్ అయిపోయాయి. ఒకటి రెండు ఖాళీలున్నా.. అవి కూడా ఇద్దరు ముగ్గురు పోటీలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
దీంతో దాదాపు రఘురామకు అవకాశం లేదు. ఇక, అవకాశం ఏదైనా ఉంటే అది అసెంబ్లీకి మాత్రమే. మరి ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తారా? లేదా? అనేది చూడాలి. ఎందుకంటే.. వైసీపీని గట్టిగా వ్యతిరేకిస్తున్న రఘురామను అసెంబ్లీకి పంపించాలని భావిస్తున్నారనే చర్చ తెరమీదికి వచ్చింది. బీజేపీ తీసుకున్న 10 సీట్లలో ఒకదానికి రఘురామకు ఇచ్చే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు. ఆయనను అసెంబ్లీకి పంపించడం ద్వారా వైసీపీని అడుగడుగునా నిలువరించే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. మరి ఆయన దీనికి సిద్ధంగా ఉంటారా? లేదా? అసలు ఇది నిజం అవుతుందా? అనేది చూడాలి.
మరోవైపు.. రఘురామ దూకుడుకు సరైన విధంగా శాస్తి జరిగిందనే చర్చ కూడా జరుగుతోంది. ఇది కూడా కొన్ని పార్టీల్లోని అత్యంత కీలక నేతలే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏకంగా అధిష్టానంపైనే ఆయన దూకుడు ప్రదర్శించడం.. సీఎం జగన్పైనే కేసులు వెలికితీయడం.. వంటివి రేపు తమకు కూడా ఎదురయ్యే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. అందుకే ఆయ నకు టికెట్ దక్కలేదనే వాదన వినిపిస్తోంది. ఏ పార్టీలో అయినా.. అనేక లోటు పాట్లు ఉన్నాయి. ఉంటాయి. కానీ, వాటిని రోడ్డుకు లాగి యాగీ చేయడాన్ని కొందరు ఇష్టపడడం లేదు. అందుకే ఆయనకు టికెట్ రాలేదా? అనే చర్చ కూడా జరుగుతోంది. మరి రఘురామ భవితవ్యం రాజ్యసభలో తేలుతుందేమో.. చూడాలి.