ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ. ఇక్కడ నుంచి నాలుగు సార్లుగా విజయం దక్కించుకుని.. 20 ఏళ్లుగా నియోజకవర్గాన్ని పాలిస్తున్న కొడాలి నానికి చెక్ పెట్టాలనేది టీడీపీ వ్యూహం. పొత్తులో భాగంగా ఈ టికెట్ను ఒక పార్టీ కోరినా ఇవ్వకుండా పట్టుబట్టి.. ఆరు మాసాల ముందు నుంచి బలమైన ప్లాన్తో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఎన్నారై వెనిగండ్ల రామును అభ్యర్థిగా ప్రకటించారు. ఈయన ప్రజలను నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. ఇక, పార్టీ కేడర్తోనూ ముందుకు కలిసి వెళ్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పుడు వెనిగండ్లరాము బలమైన నాయకుడిగానే కనిపిస్తున్నారు.
కట్ చేస్తే.. ఇతర సామాజిక వర్గాల్లో ఉన్నట్టుగానే గుడివాడలోనూ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 20 శాతం ఉన్నాయని ఒక లెక్క. ఇప్పటి వరకు స్థిరంగా ఏ పార్టీకీ పడడం లేదు. అందరూ కమ్మ వర్గంపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ, వీరి కంటే కూడా.. రెడ్డి ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. దీనిని ఇప్పటి వరకు ఎవరూ టార్గెట్ చేసుకోలేదు. కానీ, తొలిసారి టీడీపీ వైపు నుంచి రెడ్డి సామాజి క వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు. సహజంగా వైసీపీ, జగన్పై వీరు అభిమానం చూపిస్తుంటారు. కానీ, వారి పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదు. వైసీపీ గెలిచినా.. 2014కు ముందున్న పరిస్థితి(వైఎస్ హయాంలో ఉన్న రేంజ్లో) ఇప్పుడు లేదు.
దీంతో రెడ్డి సామాజిక వర్గం తర్జన భర్జనలో ఉంది. తాము ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో తర్జన భర్జన కొనసాగుతోంది. ఇలాంటి గ్యాప్ను ఇప్పుడు గుడివాడలో రాము భర్తీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా.. టీడీపీకి చేరువ చేయడం ద్వారా కొడాలి నాని.. ఆశలపై ఆయన నీళ్లు జల్లుతున్నారు. అంటే.. నాని ఇప్పటి వరకు రెడ్లు తనకే జై కొడతా రని ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే.. జగన్ రెడ్డి పార్టీ కనుక తనకు తిరుగు ఉండదని అనుకున్నారు.కానీ, అనూహ్యంగా నాని బలాబలాను గ్రహించిన రాము.. వాటినే కేంద్రంగా చేసుకుని రాజకీయం చేస్తున్నారు.
ఈ క్రమంలో రెడ్ల సంఘాలకు చెందిన నేతలను ఆయన కలుస్తున్నారు. ముఖ్యంగా రైతుల్లో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. దీంతో వారికి ఇప్పటి వరకు జరిగిన మేళ్లు, సమస్యలు, వారి ఇబ్బందులు ఇలా అన్ని వైపుల నుంచి రెడ్డి వర్గంలో ఉన్న వారి సమస్యలు తెలుసుకుని.. వాటిని పరిష్కరించేందుకు రాము హామీలు ఇస్తున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. గత 20 ఏళ్లలో ఇప్పటి వరకు తమను ప్రత్యేకంగా కలుసుకుని.. ఓట్లు అభ్యర్థించి.. తమ సమస్యలు విన్న నాయకుడు అంటూ ఎవరూ లేరని వారి చెబుతుండడం. ఇది రాముకు మాత్రమే సాధ్యమైందని వారు అంటున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. ఈ దఫా రెడ్డి ఓటు బ్యాంకు గుడివాడలో నానికి దూరం కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.