జీవో నెం.1 పై ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టు నుండి ఊరట లభించలేదు. ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. జీవో నెం.1 పై ఇటీవల ఏపి హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఏపి సర్కార్ .. సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని పిటిషన్ లో కోరింది. దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, పీఎస్ నరసింహ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టగా, ఏపి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు.
రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలపై విచారించే పరిధి వెకేషన్ బెంచ్ కు లేదని ఆయన తెలిపారు. తనకు లేని పరిధిలో వెకేషన్ బెంచ్ తీర్పు చెప్పిందని వాదించారు. ఉదయం 10.30 గంటలకు కేసును మెన్షన్ చేసి.. ప్రతివాదుల వాదనలు వినకుండానే అదే రోజున మద్యంతర ఉత్తర్వులు వెల్లడించారని పేర్కొన్నారు. ఏపి ప్రభుత్వ వాదనలను తన ఉత్తర్వుల్లో రికార్డు చేసిన సీజేఐ జసటిస్ చంద్రచూడ్ .. ధర్మాసనం కేసు మెరిట్స్ లోపలికి వెళ్లడం లేదని తెలిపారు. హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని, జీవో నెం.1 పై సోమవారం విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. హైకోర్టులో విచారణ ఉన్నందునే వాయిదా వేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ నెల 23న జీవో నెం.1 పై హైకోర్టు విచారణ జరపాలని ఆదేశించింది. ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీనిపై విచారణ జరపాలని పేర్కొంది.
టీడీపీ అధినేత చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం.. జాతీయ, రాష్ట్ర, పంచాయతీ, మున్సిపల్ రహదారులపై బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిరోధిస్తూ జీవో 1ని తీసుకువచ్చింది. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనీ, అందుకే పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం జీవో ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ జీవోను ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసమే జీవో తెచ్చారని, ఎమర్జెన్సీ కంటే కూడా దారణమైన జీవో ఇది అని ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.1పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపి హైకోర్టులో పిల్ దాఖలు చేయగా విచారణ జరిపిన ధర్మాసనం ఈ నెల 23వ తేదీ వరకూ ఆ జీవోను సస్పెండ్ చేసింది. కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. అయితే హైకోర్టులో కేసు విచారణ జరిపి తుది తీర్పు రాకముందే ఏపి ప్రభుత్వం .. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. అయితే హైకోర్టులో విచారణ ఉన్నందునే వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది.