ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు హాట్ హాట్గా మారిన సంగతి తెలిసిందే ! ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఇప్పటికే మొత్తం ఏడుదశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఏపీ ఎస్ఈసీ శనివారం మొదటి దఫా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ తిన్నారు. మరోవైపు ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు సుముఖంగా లేమని ఇప్పటికే ఉద్యోగసంఘాల నేతలు చెప్తున్నారు. నిన్న ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ కు అనేక జిల్లాలకు చెందిన అధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కేంద్రంగా కొత్త చర్చ జరుగుతోంది.
జగన్ ను ఇరికిస్తున్నారా?
ఎస్ఈసీ వ్యవహారంలో ఏపీ సర్కారు పై తెలుగుదేశం పార్టీ సంచలన కామెంట్లు చేస్తోంది. అమెరికాలో ట్రంప్ తరహాలోనే ఆంధ్రాలో సీఎం జగణ్ వ్యవహారం ఉందని మండిపడింది. “అమెరికా రాజ్యాంగానికి విరుద్దంగా ట్రంప్ వ్యవహరిస్తున్నట్లే జగన్మోహన్రెడ్డి భారత రాజ్యాంగానికి విరుద్దంగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ రాజ్యాంగ వ్యతిరేకం. ఆర్టికల్ 243 , 243 సబ్ రూల్ ఉల్లంఘించడమే. ఈసీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లకు గైర్హాజరవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సంఘం పట్ల మూర్ఖంగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగ వ్యవస్థలన్నీ మా అడుగులకు మడుగులొత్తాల్సిందే అన్న విధంగా వ్యవహరించడం ఏమిటి? ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోర్టులు చెప్పాయే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందే ఎన్నికల సంఘం చేయాలని ఎక్కడా చెప్పలేదు. “ అంటూ విరుచుకుపడుతోంది.
సమ్మె చేస్తాం….
ఎస్ఈసీ తీరుపై ఏపీ ఎన్జీవోల సంఘం తీవ్రస్థాయిలో మండిపడింది. ఎన్నికలను బహిష్కరిస్తామని తేల్చి చెప్పింది. కరోనా టీకాలు వేశాకే విధుల్లోకి వెళ్తామని స్పష్టం చేసింది. తమ శవాల మీద నడుచుకుంటూ ఎన్నికలు నిర్వహిస్తారా అని ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల విధుల్లో పాల్గొని ప్రాణాలు పొగొట్టుకోవాల్సిన అవసరం లేదని…అవసరమైతే సమ్మెకు సిద్ధమని ప్రకటించారాయన. ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని.. దుష్పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.