Sonia Gandhi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఓ ప్రధాన సమస్యపై లేఖ రాసారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రస్తుతం రెండు వాక్సిన్ లు అందుబాటులో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే వాక్సిన్ అందిస్తున్నారు. అయితే కరోనా బారిన అన్ని వయసుల వారు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ.. మోడీకి లేఖ రాసారు.
కరోనా వాక్సిన్ అవసరమైన అందరికీ అందించాలని కోరారు. వయసుతో సంభందం లేకుండా అవసరం అయిన అన్ని వయసుల వారికీ వాక్సిన్ ఇవ్వాలన్నారు. సోనియా విజ్ఞప్తిపై మోడీ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి. దేశంలో వాక్సిన్ కొరత ఉన్నప్పటికీ ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తుండటంపై ప్రతి పక్షాల నుండి విమర్శలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో భారత దేశ ప్రజలకు అందుబాటులో ఉన్న తరువాత అదనపు వాక్సిన్ నిల్వలను ఇతర దేశాలకు అనుమతులు ఇవ్వాలన్న డిమాండ్ వస్తున్నది.
ఇకపోతే దేశ వ్యాప్తంగా కరోనా కేసుల నమోదులో అగ్ర రాజ్యం అమెరికాతో భారత్ పోటీ పడుతోంది. వైరస్ ఉధృతిలో అమెరికా తరువాతి స్థానంలో ఇండియా ఉంది. తాజాగా భారత్ లో 1,68,912 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటి వరకు కరోనా బారిన వారి సంఖ్య 1,35,27,717కి చేరింది. కేసుల పరంగా భారత్ రెండవ స్థానంలో ఉండగా, మృతుల సంఖ్య పరంగా లక్షా 70వేలతో నాల్గవ స్థానంలో ఉంది. 24గంటల వ్యవధిలో కరోనా కారణంగా భారత్ లో 904మంది మృతి చెందారు. ఓ పక్క కేసులు, మరో పక్క మృతుల సంఖ్య పెరుగుతుండటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆందోళనకు గురి చేస్తోంది.