ఎన్నికలు అనగానే సర్వేలకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్రజానాడిని పట్టుకుని.. తదుపరి ప్రభుత్వం ఎవరిది.. అని ముందే చెప్పేస్తున్న సంస్థలు పెరుగుతున్నాయి. ఇక, రాజకీయాలపై ఉన్న ఆసక్తికొద్దీ.. ప్రజలు కూడా వీటిని విశ్వసిస్తున్నారు. రోజు రోజుకు.. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. ఉత్కంఠ పెరుగుతోంది. దీంతో సర్వేలపై మరింత ఆసక్తి రేగుతోంది. ఇప్పటి వరకు అనేక సర్వేలు వచ్చాయి. అనేక విశ్లేషణలు వచ్చాయి. వీటిలో భిన్నమైన తీర్పులే వచ్చాయి.
అయితే.. చిత్రంగా మంగళవారం రెండు సంస్థలకు చెందిన సర్వేలు వచ్చాయి. వాస్తవానికి ఈ రెండు కూడా చాలా విశ్వసనీయత ఉన్న సంస్థలే కావడం గమనార్హం. అయితే.. చిత్రం ఏంటంటే.. రెండూ కూడా పూర్తి భిన్నమైన ఫలితాలను అంచనా వేయడం గమనార్హం. అంతేకాదు.. రెండు సంస్థలు.. కూడా లక్షల సంఖ్యలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కానీ, ఫలితం మాత్రం పూర్తి భిన్నంగా రావడంతో ఏది విశ్వసనీయ సర్వే అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. అంతేకాదు.. ప్రజా నాడి సర్వేలకు అందడం లేదా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.
1) ఆత్మ సాక్షి: ఈ సంస్థకు చాలా పెద్దపేరే ఉంది. ఇది మంగళవారం సాయంత్రం సర్వే ఫలితాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. ఎన్డీయే కూటమి(టీడీపీ-జనసేన-బీజేపీ)కి నికరంగా ఎలాంటి పోటీ లేకుండా.. దక్కించుకునే స్థానాలు 47. ఇక, వైసీపీ అయితే.. నికరంగా ఎలాంటి పోటీ లేకుండా దక్కించుకునే స్థానాలు 97. ఇక, టఫ్ ఫైట్ ఉన్నవి 24. వీటిలో కూటమికి 10 స్థానాల్లో అవకాశం ఉంది. వైసీపీకి 17 స్థానాల్లో అవకాశంఉంది. ఎంపీ సీట్లలోనూ కూటమి 4-5 స్థానాల్లోనూ.. వైసీపీ 20-22 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది.
2) ఏపీబీ -సీ ఓటరు: 25 ఎంపీ సీట్లలో ఎన్డీఏ కూటమి అత్యధికంగా 20 స్థానాలు గెల్చుకునే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్ – సీఓటర్ ఒపీనియన్ పోల్లో స్పష్టమయింది. బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తూండగా ఐదు చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది. ఇక టీడీపీ, జనసేన పార్టీలు కలిసి 15 స్థానాల్లో విజయం సాధిస్తాయి. జనసేన పార్టీ రెండు స్థానాల్లోనే పోటీ చేస్తున్నందున ఆ రెండు చోట్ల గెలిచినా.. టీడీపీ పదమూడు చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది.
కొసమెరుపు: చూశారా? రెండూ విశ్వసనీయ సంస్థలే. కానీ, చాలా వైరుధ్యంతో ఈ సర్వేలు ఇచ్చాయి. మరి ప్రజానాడి ఎలా ఉందో ఇంకా పట్టుకోలేక పోతున్నారా? అనేది ప్రశ్న.