AP Minister Botsa Satyanarayana: ఏపి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతలు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా పాఠశాలల విలీనానికి సంబంధించిన జీవో 117 రద్దు సహా ఉపాధ్యాయ బదిలీలు తదితర అంశాలపై చర్చించారు. జీవో నెం.117లోని అభ్యంతరాలను పరిశీలించి సవరణ ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. చిత్తూరులో పదవ తరగతి వరకూ తెలుగు మీడియం కావాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు తెలియజేయగా, ఇంగ్లీషు మీడియం అడ్మిషన్లనే ఇవ్వాలని మంత్రి బొత్స తేల్చి చెప్పారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఒకటి నుండి 8వ తరగతి వరకూ నిర్బంధ ఇంగ్లీషు మీడియం విద్యను అమలు చేస్తామనీ, ఈ విధానంపై వెనక్కితగ్గేది లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. 3,4,5 తరగతుల విద్యార్ధులు ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం జరుగుతుందన్నారు. 21 మంది విద్యార్ధులు ఉన్న చోట ఇద్దరు ఎస్జీటీలు ఉంటారని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాల తెలియజేసిన సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. సమావేశం అనంతరం ఉపాధ్యాయ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రం లేదా రేపటిలోగా 117 జివో పై సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి చెప్పారన్నారు. ప్రభుత్వం నిర్ణయం తర్వాత రేపు డీఈఓ కార్యాలయాల ముట్టడికి ఇచ్చిన పిలుపుపై పునరాలోచన చేస్తామని ఫ్యాఫ్టో చైర్మన్ తెలిపారు.