అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అన్నమయ్య జిల్లా అంగళ్ల, పుంగనూరులో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య రాళ్ల దాడి జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అంగళ్లులో చంద్రబాబు రోడ్ షోలో రాళ్లు, చెప్పులు విసిరేందుకు ప్రయత్నించారు. దీంతో ఎస్పీజీ కమాండోలు చంద్రబాబుకు రక్షణగా నిలిచారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీవ్ర స్థాయిలో వైసీపీపై ధ్వజమెత్తారు.
మరో వైపు చంద్రబాబు అంగళ్లు నుండి పుంగనూరు బైపాస్ నుండి చిత్తూరు వైపు వెళ్లాల్సి ఉండగా, పుంగనూరు రోడ్డులో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. టీడీపీ శ్రేణులు పుంగనూరులో వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. పలువురు పోలీసులు గాయపడ్డారు. పోలీస్ వాహనాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జి చేశారు. కార్యకర్తలపై రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువులను ప్రయోగించారు. దీంతో పుంగనూరు బైపాస్ రోడ్డులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు పర్యటనలో జరిగిన ఘర్షణలో పోలీసులతో పాటు పలువురు వైసీపీ, టీడీపీ శ్రేణులు గాయపడ్డారు.
చంద్రబాబు పర్యటనలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపై టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడి చేయడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు. గాయపడిన పోలీస్ సిబ్బందిని ఆసుపత్రికి తరలించామని, పోలీసులపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దాడి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేస్తామని తెలిపారు. పోలీసులపై దాడి చేయడం అమానుషమన్నారు. పుంగనురులో మాజీ సీఎం పర్యటన లేదని, బైపాస్ మీదుగా ఆయన చిత్తూరు వెళుతున్నందున ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందిపై దాడి చేశారని అన్నారు.
ఇవాళ విధ్వంసానికి పెద్దిరెడ్డి, పోలీసులు కారణమని చంద్రబాబు ఆరోపించారు. పుంగనూరు ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాను పుంగనూరు రోడ్డుపై తిరగకూడదా అని ప్రశ్నించారు. మొన్నే పులివెందులలో పొలికేక వినిపించా, ఇప్పుడు పుంగనూరులో గర్జిస్తున్నా అని పేర్కొన్నారు. తాను మళ్లీ పుంగనూరు వస్తానని అన్నారు.
Rahul Gandhi: ‘మోడీ ఇంటి పేరు’ పరువు నష్టం కేసులో సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్